ముగిసిన కార్తిక మాస లక్ష దీపోత్సవం
ముగిసిన కార్తిక మాస లక్ష దీపోత్సవం
కనుల పండువలా సీతారాముల కల్యాణం
అనుగ్రహభాషణం చేసి జ్యోతి ప్రజ్వలన చేసిననాచగిరి శ్రీక్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతీ స్వామి
పాల్గొన్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
గజ్వేల్, నవంబర్ 28;గజ్వేల్ పట్టణంలో మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించిన కార్తిక మాస లక్ష దీపోత్సవం ముగిసింది. ఆదివారం పురోహితులు సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిపారు. నాచారం శ్రీక్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతీ స్వామి హాజరై భక్తులకు అనుగ్రహ భాషణం చేసి, దీపాన్ని వెలిగించి లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, శృంగేరీ పీఠం ఆస్థాన పండితులు గర్రెపల్లి మహేశ్వరశర్మ
తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో మూడురోజులుగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన లక్ష దీపోత్సవం ఆదివారం ముగిసింది. నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ , పట్టణ పురోహితులు అందరి వైదిక నిర్వహణలో, లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మూడవ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా గజ్వేల్ పురోహితులు, వర్గల్ వేదవిద్యార్థులు వేదాలను వల్లించారు. అనంతరం భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవం అంత బ్రహ్మాండంగా లక్షదీపోత్సవ వేదికపై సీతారాముల కల్యాణాన్ని అంగరంగవైభవం నిర్వహించారు. నాచారం దేవస్థానం వేదపండితులు తీగుళ్ల గోపాలకృష్ణశర్మ, గజ్వేల్ పండితులు రాజశేఖరశర్మ, చాడ నందబాలశర్మ, శ్రీరామశర్మ, కృష్ణమూర్తి శర్మ తదితరులు కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళిలు పాల్గొన్నారు. శృంగేరీ పీఠం ఆస్థాన పండితులు గర్రెపల్లి మహేశ్వరశర్మ, వెంకటేశ్వర భక్తిఛానల్ వ్యాఖ్యాత బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖరశర్మల ప్రవచనాలను నిర్వహించగా, నాచారం గుట్టలోని శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతీ స్వామి హాజరై భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం స్వామీజీ దీపాన్ని వెలిగించి లక్షదీపోత్సవాన్ని ప్రారంభించడంతో ప్రజలంతా కార్తిక దీపాలను వెలిగించారు.
ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి : ఎఫ్ఢీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డి
ప్రజలంతా ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. ఉత్సవాలకు హాజరై మాట్లాడారు. గజ్వేల్ పట్టణంలో లక్ష దీపోత్సవం నిర్వహించడం శుభసూచకమన్నారు. కార్తికమాసంలో ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని, ఇంత గొప్పకార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఉత్సవ కమిటీకి అభినందనలు తెలిపారు.
గజవెల్లికి అర్థం సృష్టికి ఆదిబిందువు: గర్రెపల్లి మహేశ్వర శర్మ
గజవెల్లి అంటే పురాణాల ప్రారంభానికి నాంది బిందువు అని శృంగేరీ పీఠం ఆస్థాన పండితుడు గర్రెపల్లి మహేశ్వరశర్మ వ్యాఖ్యానించారు. మూడవరోజు కార్యక్రమంలో భాగంగా ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. గజ్వేల్ గొప్ప శక్తి కేంద్రంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర రాజకీయాలకు గజ్వేల్ శక్తికేంద్రంగా మారిందని, అలాగే ఈ ప్రాంతంలో సీఎం కేసీఆర్ అద్భుతమైన ఆయుతా చండీయాగం చేయడం వల్ల ఎంతో శక్తివంతంగా మారిందన్నారు. ఇక్కడ జరుపుకుంటున్న లక్షదీపోత్సవం ఎంతో అద్భుతమైనదన్నారు.
గజ్వేల్ ప్రజల పూర్వజన్మ సుకృతం: పాలెపు చంద్రశేఖరశర్మ
ప్రజలంతా మూడు రోజుల పాటు కార్తిక దీపాలను వెలిగించడం గజ్వేల్ ప్రజల పూర్వ జన్మ సుకృతంగా పాలెపు చంద్రశేఖరశర్మ తెలిపారు. శివుడికి విష్ణునామం, విష్ణుమూర్తికి శివనామం అంటే ఎంతో ప్రీతి అన్నారు. వారిద్దరికీ ఇష్టమైనది కార్త్తికమాసమన్నారు.అందుకే ఈ మాసంలో చేసే దానాలు, పూజలు, దీపారాధన ఎంతో పుణ్యాన్నిస్తాయన్నారు. కార్యక్రమాల్లో మూడురోజులుగా దూరదర్శన్ వ్యాఖ్యాత కృష్ణవేణితో పాటు ఉపాధ్యాయుడు అదరాసుపల్లి శశిధరశర్మలు వ్యాఖ్యానం నిర్వహించారు. అలాగే విపంచి మ్యూజికల్ అకాడమీ వారి సంగీత విభావరి కూడా అందరినీ అలరించింది. ఎన్నడూ లేనివిధంగా మొట్టమొదటి సారిగా గజ్వేల్లో లక్షదీపోత్సవం నిర్వహించిన లక్షదీపోత్సవ కమిటీ సభ్యులు, వేదపండితుడు శ్యాంప్రసాద్శర్మ, పట్టణ పురోహితులను ప్రజలు అభినందించారు.
కార్త్తికదీపం సర్వపుణ్యకరం, సకల పాపహరం..
గజ్వేల్ పట్టణంలో లక్షదీపోత్సవం నిర్వహించడం చాలా సంతోషకరమని నాచారం శ్రీక్షేత్రం పీఠాధిపతి శ్రీ మధుసూదనానంద సరస్వతీ అన్నారు. కార్తికమాసంలో దీపాన్ని వెలిగించడం ఎంతో పుణ్యమని, దీపాలను వెలిగించడం వల్ల సకల పాపరాశి నశించిపోతుందన్నారు. ప్రజలంతా భక్తిభావాన్ని పెంపొందించుకుని, సదా భగవన్నామ స్మరణ చేయాలన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు.