దోమల నివారణకు వినూత్న పద్ధతి అమలు
74 ఐవోటీ మిషన్లతో పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ ట్రాకర్ విధానం
ఆన్లైన్ పర్యవేక్షణతో పారదర్శకంగా ఫాగింగ్ ప్రక్రియ
సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): దోమల నియంత్రణలో జీహెచ్ఎంసీ మరో వినూత్న పద్ధతికి అధికారులు శ్రీకారం చుట్టారు. లార్వా దశలోనే దోమలను నివారించి నగర ప్రజలకు దోమల బెడద నుంచి విముక్తి కల్పించేందుకుగానూ ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను ఆమలు చేస్తున్న ఎంటమాలజీ విభాగం అధికారులు తాజాగా మరో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు పరుస్తున్నారు. ప్రస్తుత డ్రోన్ పద్ధతికి తోడుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తెలంగాణ మసిటో ఎరాడికేషన్ డిజిటల్ సొల్యూషన్ (టీ-ఎంఈడీఎస్) కింద గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో పైలెట్ ప్రాజెక్ట్గా ఈ ప్రక్రియ చేపడుతున్నారు.
అర్బన్ మలేరియా పథకంలో భాగంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను ఫాగింగ్ యంత్రాలకు అమర్చారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా 10 పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లతో పాటుగా మరో 64 వెహికిల్ మౌంటెడ్ యంత్రాలు మొత్తం 74 మిషన్లను స్మార్ట్ ట్రాకర్ను అమర్చారు. ఆ పరికరాలను మొబైల్ అప్లికేషన్ ద్వారా అధికారులకు యాక్సెస్ చేసి డాష్ బోర్డుకు అనుసంధానం చేశారు. ఆయా జోనల్, డిప్యూటీ కమిషనర్లతో పాటుగా ఎంటమాలజీ చీఫ్, సీనియర్ అధికారులు, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది ఫాగింగ్ పక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నూతన పరిజ్ఞానంతో ఫాగింగ్ యంత్రాలు ఒక రోజులో ఎన్ని ప్రాంతాలు ఎంత దూరం ప్రయాణించాయో తెలుసుకొని సక్రమ పద్ధతిలో ఫాగింగ్ చర్యలు తీసుకోవడంలో సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఏ విధమైన ఆటంకాలు గానీ అవకతవకలు జరిగినప్పుడు ఈ యాప్తో ఉన్న చోట నుంచే వాటి నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో దోమల బెడద నివారణకు అవకాశాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నామని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగం వినియోగించడంతో పాటు మానవ వనరుల ద్వారా కూడా నూతన పద్ధతులలో లార్వా దశ నుండే నివారణ చర్యలు చేపడుతున్నారు.