హరితహారంతో పచ్చందాలు అద్దుకున్న పాఠశాలలు
చెట్ల కింద చదువులు
ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం
ఏపుగా పెరిగిన మొక్కలు
ఆహ్లాదకరంగా పరిసరాలు
పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్న విద్యార్థులు
హరిత నిధికి చేయూతనిస్తామంటున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
రాయికల్/ధర్మపురి/పెగడపల్లి, అక్టోబర్ 22;ఏపుగా పెరిగిన చెట్లతో పరుచుకున్న పచ్చదనం..నిర్మలమైన పరిసరాలతో ఆహ్లాదకర వాతావరణం. వెరసి ఆ పాఠశాలలు రవీంద్రనాథ్ఠాగూర్ శాంతినికేతన్ను తలపిస్తున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఉపాధ్యాయులు, విద్యార్థులు కంటికి రెప్పలా కాపాడడంతో పచ్చదనం పెరిగి ఆ స్కూళ్లు నందనవనాలను మరిపిస్తున్నాయి. చిన్నారులు ప్రకృతి ఒడిలో సేదతీరుతూ చెట్ల కింద చదువుకొంటూ హరిత అందాలను ఆస్వాదిస్తున్నారు. ప్రార్థన నుంచి మొదలుకొని స్కూళ్లను వదిలే దాకా ఆ చల్లని వాతావరణంలో గడుపుతున్నారు.
రాయికల్, అక్టోబర్ 22: హరితహారం ఫలాలు అందివస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఏడు విడుతల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి హరితశోభ సంతరించుకున్నాయి. రాయికల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు విరివిగా మొక్కలు నాటారు. యేటా పాఠశాల విస్తీర్ణం ప్రతి పాఠశాలలో 50 నుంచి 200 వరకు మొక్కలు పెట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వాటి సంరక్షణపై దృష్టిపెట్టారు. ఊత కర్రలు కట్టి, ట్రీ గార్డులు అమర్చారు. ఒక్కో మొక్కకు ఒక్కో విద్యార్థి పేరుపెట్టుకొని మురిసిపోయారు. క్రమం తప్పకుండా నీరందించి, చుట్టూ గడ్డిని తొలగించడంతో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వనాలను తలపిస్తూ పచ్చదనాన్ని పంచుతున్నాయి. వీటి కింద కూర్చొని పచ్చని పరిసరాలను ఆస్వాదిస్తూ చదువుకుంటున్నారు. సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన హరితనిధికి తమవంతు చేయూతనిచ్చేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందుకువస్తున్నారు.
నందనవనంలా నర్సింహునిపేట పాఠశాల..
పెగడపల్లి, అక్టోబర్ 22:పెగడపల్లి మండలం నర్సింహునిపేట ప్రభుత్వ పాఠశాల పచ్చని చెట్లతో నందనవనాన్ని తలపిస్తున్నది. పదేళ్ల క్రితం నాటిన మొక్కలతో పాటు, ఏటా హరితహారంలో మొక్కలు నాటుతుండడంతో స్కూల్ ఆవరణమంతా పండ్లు, నీడ నిచ్చే చెట్లతో ఆహ్లాదకర వాతావరణం నెలకొని సరికొత్తగా దర్శనమిస్తున్నది. మధ్యాహ్నం వేళ విద్యార్థులు చెట్ల కిందే కూర్చుని చదువుకుంటు న్నారు. ఈ స్కూల్లోనే అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తుండడంతో చిన్నారులు పండ్ల చెట్లు, పూల మొక్కలు పరిమళాలను ఆస్వాదిస్తున్నారు. గ్రామ పంచాయతీ నల్లా ద్వారా నిత్యం చెట్లు, మొక్కలకు నీరందిస్తుండడంతో హరిత చిగురు తొడుక్కొని స్కూల్కు
పచ్చందాలు పంచుతున్నాయి..
పచ్చదనానికి కేరాఫ్ కస్తూర్బా స్కూల్..
రాయికల్ మండలం ఉప్పుమడుగులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆకుపచ్చ సొబగులు అద్దుకున్నది.. గేటు నుంచి తరగతి గదుల దాకా పచ్చదనంతో సరికొత్తగా కనిపిస్తున్నది. ప్రాంగణంలో అడుగుపెట్టిన వారికి పచ్చని స్వాగతం లభిస్తున్నది. హరితహారం స్ఫూర్తితో ఉపాధ్యాయులు, విద్యార్థులు స్కూల్ పరిసరాల్లో సుమారు 250 మొక్కలు నాటారు. లోపలి భాగంలో పూలు, నీడనిచ్చే మొక్కలు, స్కూల్ బయట మైదాన ప్రాంతంలో మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, బాదాం, ఉసిరి లాంటి పండ్ల మొక్కలునాటారు. అదేవిధంగా కిచెన్గార్డెన్లో పలు రకాల కూరగాయలు, ఆకు కూరలను పెంచుతున్నారు.
స్కూళ్లు.. హరిత లోగిళ్లు..
ధర్మపురి, అక్టోబర్ 22: మండలంలోని వివిధ పాఠశాలల్లో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరుగడంతో స్కూళ్లన్నీ హరితలోగిళ్లుగా తయారయ్యాయి. ముఖ్యంగా మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాలల ఆవరణలో నాటిన మొక్కలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు నీళ్లు పట్టడంతో ఏపుగా పెరిగి పెద్దయ్యాయి. మగ్గిడి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉదయం చెట్ల నీడ కిందే ప్రార్థన. మధ్యాహ్న భోజనం, ఆటపాటలు చేస్తున్నారు. ఆహ్లాదభరిత వాతావరణంలో విద్యనభ్యసించడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు.