వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
డ్రోన్ ద్వారా మందుల సరఫరా పరిశీలన
పరిగి, డిసెంబర్ 20 : ఈ నెలాఖరు వరకు జిల్లాలో వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులతో వ్యాక్సినేషన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోజుకు 30వేల డోసుల చొప్పున వ్యాక్సినేషన్ చేసి లక్ష్యం పూర్తి చేయాలన్నారు. 2వ డోసు వ్యాక్సినేషన్ జిల్లాలో 30శాతం కావడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలవారీగా ప్రతిఒక్కరూ నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు ఏరియా దవాఖాన ఆవరణలో ఏర్పాటుచేసిన డ్రోన్ ద్వారా మందుల సరఫరా ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సిద్దులూరు పీహెచ్సీ నుంచి శాంపిల్స్ను వికారాబాద్కు డ్రోన్ ద్వారా తరలించగా, అదే డ్రోన్ ద్వారా సిద్దులూరుకు వ్యాక్సిన్లు, మందులను పది నిమిషాల్లో పంపించారన్నారు. డ్రోన్ ద్వారా జిల్లాలో 50 కిలోమీటర్లు పరిధిలో అత్యవసర సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
దళితబంధు అందేలా ఏర్పాట్లు చేసుకోవాలి
జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున మొత్తం 400 మందికి దళిత బంధు పథకం అందేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత బంధు పథకం అమలు తీరుపై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమాలోచనలు చేసి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. లబ్ధిదారులు వచ్చిన డబ్బులతో మూస పద్ధతిలో టాక్సీలు, కిరాణం, బట్టల దుకాణాలు కాకుండా ఉన్నతమైన వ్యాపారాలు చేసుకునేలా సలహాలు అందజేయాలని అన్నారు. పది మంది కలిసి ఒక పరిశ్రమను ఏర్పాటు చేసుకొని లబ్ధి పొందేలా చూడాలని సూచించారు. ఇతర లాభదాయకమైన వ్యాపారాలు చేపట్టే కార్యక్రమాలను అధికారులు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా వైద్యాధికారి తుకారాం, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో జీవరాజ్, ఎల్డీఎం రాంబాబు, సంక్షేమ శాఖల అధికారులు, డాక్టర్ అరవింద్, వైద్యాధికారులు పాల్గొన్నారు.