కేంద్రం మెడలు వంచి.. బీసీల ఆకాంక్షను నెరవేరుస్తాం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
కవాడిగూడ, డిసెంబర్ 20 : బీసీ గణన చేపట్టకపోతే దేశంలో అగ్గి రాజేస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ గణన చేపట్టాలనే ప్రధాన డిమాండ్తో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 13, 14, 15, 16 తేదీలలో వందలాది మంది బీసీ సంఘాల కార్యకర్తలతో కలిసి ఢిల్లీలో చేపట్టిన ఆందోళన విజయవంతమైనదని అన్నారు. సోమవారం దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజులుగా ఢిల్లీలో చేపట్టిన బీసీల ఆందోళనకు 22 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. తమ ఆందోళనతోనే పార్లమెంట్లో బీసీ గణన అంశం చర్చకు వచ్చిందన్నారు. బీసీల గణన జరిగే వరకు పోరాటం ఆపేదిలేదని, కేంద్రం మెడలు వంచి బీసీల ఆకాంక్షను నెరవేర్చుకుంటామని అన్నారు. కేంద్రం పట్టించుకోకపోతే అగ్గి రాజేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, జాజుల లింగం గౌడ్, మాదేశి రాజేందర్, మనిమంజరి, ఠాకూర్, సంధ్యరాణి, రేణుక, గౌతమి, స్వర్ణ, శివరాణి, తదితరులు పాల్గొన్నారు.