జిల్లావ్యాప్తంగా 712పాఠశాలలు..
54,146 మంది విద్యార్థులు
పేరెంట్స్ జాబితా రూపకల్పనకు ప్రధానోపాధ్యాయుల కసరత్తు
భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 20 : పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణలో పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా విద్యాప్రమాణాల పెంపు కోసం ఏర్పాటైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం కమిటీల కాల పరిమితి ఈనెల 30తో ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్లో కొత్త కమిటీల ఏర్పాట్ల కోసం విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు త్వరలో షెడ్యూల్ విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని 712పాఠశాలలకు గాను, 481ప్రాథమిక పాఠశాలలు. 68ప్రాథమికోన్నత పాఠశాలలు. 163ఉన్నత పాఠశాలలు ఉండగా 54,146మంది విద్యార్ధులు ఉన్నారు. ఎస్ఎంసీ ఎన్నికల ఓటర్ల జాబితాలోని తల్లి గాని, తండ్రి గాని, లేక సంరక్షకుల్లో ఒక్కరు ఓటుకు అర్హులు. ఓటర్లలో 50శాతం హాజరు కాకపోతే కోరం లేనట్లే, ముందుగా సభ్యులను చేతులెత్తే పద్దతిన, లేక మూజువాణి ఓటుతో, తప్పనిసరి పరిస్థితుల్లో రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్దతి నిర్వహిస్తారు.
ప్రధానోపాధ్యాయులే కన్వీనర్లు…
పాఠశాల యాజమాన్య కమిటీల ఎంపికలో భాగంగా, కమిటీల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. దీంతో పాటుగా మరో సీనియర్ ఉపాధ్యాయుడు, వార్డు సభ్యులు లేదా కౌన్సిలర్, ఏఎన్ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎన్నికైన సభ్యులతో పాటు ఆరుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు ఉంటారు. ప్రాథమిక పాఠశాలలో ఎన్నికైన 15మందితో పాటు, ఆరుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులతో మొత్తం 23మంది ఉంటారు. 7వ తరగతి వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 29మంది, 8వ తరగతి వరకు ఉంటే 32మంది, హైస్కూల్లో మొత్తం 17మంది సభ్యులు ఉంటారు. ఆయా పాఠశాల పరిధిలో విద్యా వేత్త, పాఠశాల అభివృద్ధికి సహకరించే దాతలను ఎస్ఎంసీ సభ్యులుగా కోఆప్ట్ చేసుకునే వీలుంటుంది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి, ఇద్దరు విద్యార్థులు, గ్రామ గ్రామ సర్పంచ్, మున్సిపల్ చైర్మన్లు పాఠశాలల్లో నిర్వహించే సమావేశాలకు హాజరుకావచ్చు. పాఠశాల యాజమాన్య కమిటీకి రెండేడ్లు కాలపరిమితి ఉంటుంది.