యాదాద్రి, డిసెంబర్14 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో పూజలు చేశారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలపాటు పూజా పర్వాలు కొనసాగాయి. పూజల్లో దేవస్థాన ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చక బృందం, పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నిత్య కల్యాణం..
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలోని విష్ణు పుష్కరిణి వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన జరిపారు. నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండపంలో శ్రీ లక్ష్మీనరసింహుల నిత్య కల్యాణం జరిపారు. తొలుత శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం, సాయంత్రం అలంకార సేవోత్సవాన్ని నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు శ్రీస్వామి, అమ్మవార్ల ఆశీస్సులు ఆందజేశారు. ఆంజనేయ స్వామివారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు పూజలు జరిగాయి. సత్యనారాయణ స్వామి వ్రత పూజలతోపాటు వివిధ కైంకర్యాలు, గదులు, పూజల ద్వారా రూ.13,87,092 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.