నగరవాసుల అత్యధిక మాంసాహారం ఇదే..
ఆ తర్వాతే మటన్, చేపలు, రొయ్యలు
భారీగా అమ్ముడుపోతున్న కోడిగుడ్లు
ఫ్రెష్ టు హోం సర్వేలో వెల్లడి
సిటీబ్యూరో, జనవరి 13 ( నమస్తే తెలంగాణ) : కోడికూర డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. చికెన్ వంటకాలకు నగర వాసులు ఫిదా అవుతున్నారు. ముక్క లేనిది ముద్ద దిగడం లేదు. మొన్నటి వరకు స్విగ్గీ సర్వేలో చికెన్ బిర్యానీ టాప్లో నిలువగా.. తాజాగా ఫ్రెష్ టు హోం ఆన్లైన్ ఈ కామర్స్ గురువారం ఆర్డర్ లిస్ట్ రిపోర్ట్ను విడుదల చేసింది. ఆర్డర్ లిస్టులో అత్యధికంగా చికెన్ విక్రయించినట్టు పేర్కొంది. ఆ సంస్థ టాప్ టెన్ లిస్ట్లో చికెన్ను కస్టమర్లు ఎక్కువగా ఆర్డర్ చేసినట్టు వివరించింది. దేశ వ్యాప్తంగా చికెన్ ఆర్డర్స్ను పరిశీలిస్తే హైదరాబాద్లోనే చికెన్ ఆర్డర్స్ విరివిగా ఉన్నట్లు వెల్లడించింది. తర్వాతి స్థానంలో మటన్, చేపలు, రొయ్యలు ఉన్నట్లు తెలిపింది. వీటితో పాటు చికెన్ వంటకాలు – చికెన్ ఘీ రోస్ట్, స్పైసీ చిట్టినాడ్ చికెన్, గ్రానీస్ మసాల ఫ్రైడ్ చికెన్, యమ్మీ చికెన్ కట్లెట్ తదితర కోడి కూర వంటకాలను నగరవాసులు అత్యధికంగా ఆరగించారని రిపోర్టులో పేర్కొంది. నార్త్ ఇండియాలో చికెన్, రహు ఫిష్కు అత్యధికంగా ఆర్డర్స్ వచ్చాయని సంస్థ సీఈవో శాన్ కడవిల్ పేర్కొన్నారు. ప్రతి సెకన్కు ఒక ఆర్డర్ వచ్చినట్టు తెలిపారు. క్రిస్మస్లోనూ మాంసాహార వంటకాలకే అత్యధికంగా ఆర్డర్లు వచ్చినట్టు వివరించారు. ఢిల్లీలో చికెన్ డ్రమ్స్టిక్స్, కేరళలో చేప వంటకాలు, చెన్నైలో చికెన్ గిజార్డ్ వంటకాలకు ఆర్డర్స్ అధికంగా వచ్చాయని పేర్కొన్నారు. కోడిగుడ్ల ఆర్డర్స్ కూడా చికెన్ తర్వాతి స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.