ర్యాగింగ్ నియంత్రణకు యూనివర్సిటీ, కాలేజీల్లో వాట్సాప్ గ్రూపులు
టోల్ఫ్రీ, హెల్ప్లైన్ కేంద్రాలు
విద్యార్థులకు అధికారుల ఫోన్ నంబర్లు
ఫస్ట్ సెమిస్టర్ ప్రారంభం కావడంతో అలర్ట్
ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
అందరూ స్నేహపూర్వకంగా ఉండాలని సూచన
లొకేషన్ షేర్ చేస్తే.. పట్టేస్తారు.. శిక్షిస్తారు..!
సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా, జేఎన్టీయూ వంటి అన్ని యూనివర్సిటీలలో బీటెక్, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో ర్యాగింగ్ నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు. ర్యాగింగ్ వల్ల ఎవరూ కూడా మానసికంగా కుంగిపోకుండా, సీనియర్ల ర్యాగింగ్ నుంచి జూనియర్లను రక్షించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందు లో భాగంగా యూనివర్సిటీలలో కొత్తగా తరగతులు, కాలేజీల వారీగా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పా టు చేస్తున్నారు. వైస్చాన్స్లర్, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, హాస్టల్ నిర్వహణ అధికారులతో పాటు విద్యార్థులు ఉంటారు. ఈ గ్రూప్లో ర్యాగింగ్ చేస్తున్న వారి వివరాలు, ప్లేస్ షేర్ చేస్తే.. అధికారులు వెంటనే స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ర్యాగింగ్ నియంత్రణలో భాగంగా..
యూనివర్సిటీలలో ఇప్పటికే టోల్ఫ్రీ నంబర్లు, హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికీ అధికారుల ఫోన్ నంబర్లు ఇవ్వనున్నారు. విద్యార్థులు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్తో పాటు ప్రైవేటు అఫిలియేటెడ్ కాలేజీలలో కూడా ర్యాగింగ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయా కాలేజీ యాజమాన్యాలకు యూనివర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కాలేజీ క్యాంపస్లో యాంటీ ర్యాగింగ్ బోర్డులు, స్లోగన్లు ఏర్పాటు చేస్తున్నారు.
ర్యాగింగ్పై సెమినార్.!
ర్యాగింగ్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలుంటాయి.
జూనియర్ విద్యార్థులు ఎన్ని రకాల మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది.
బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొటారు.
సీనియర్లు, జూనియర్లు కలిసి మెలిసి ఏ విధంగా ఉండాలి. దాని వల్ల కలిగే లాభాలు.. వంటి అన్ని కోణాల్లో ఆలోచన చేసే విధంగా సెమినార్లు నిర్వహించనున్నారు.
మారకుంటే కఠిన చర్యలు
సెమినార్లు నిర్వహించినప్పటికీ సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడితే ర్యాగింగ్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి ఆయా కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలో యూనివర్సిటీలు, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది.