సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ ): గ్రేటర్ వాసులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్, శానిటేషన్, వైద్య, ఎలక్ట్రిసిటీ, యూసీడీ, యూబీ డీ అధికారులు పూర్తిస్థాయిలో చర్య లు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, ఎస్ఈ చిన్నారెడ్డి పలు విభాగాల అధికారులతో సోమవారం కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అయిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)ద్వారా సిటీజన్స్ సర్వీసెస్ ఎవరి ప్రమే యం లేకుండా జీహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్, ట్రేడ్ లైసెన్స్, టీఎస్ బీపాస్, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ ఇతర సర్వీసులను సిటీజన్స్కు అందించడంలో ముందంజలో ఉండాలన్నారు. కూకట్పల్లి జోన్లోని 22 వార్డుల్లో మంజూరైన గ్రేవ్ యార్డ్లు,మోడల్ గ్రేవ్ యార్డ్కుగాను కంపౌండ్ వాల్, నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 219 కమ్యూనిటీహాల్స్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని మేయర్ సూచించారు. 440 టాయిలెట్స్ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించడానికి డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్ఓలు సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. జనవరి 26 నుంచి ప్రతి శుక్రవారం ప్రతివార్డులో కార్పొరేటర్లు, అధికారులు ఫ్రైడే ట్రీ డేగా నిర్వహించాలని మేయర్ పిలుపునిచ్చారు. టీనేజర్ల వ్యాక్సిన్లను కళాశాలలకు వెళ్లి స్వయంగా అందించాలని సూచించారు. బూస్టర్ డోస్పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఎస్ఎఫ్ఏలు, జవాన్లు, శానిటరీ సూపర్ వైజర్స్, ఏఎంఓహెచ్, డిప్యూటీ కమిషనర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేయాలని మేయర్ చెప్పారు. ఏఎంఓహెచ్లు, డిప్యూటీ కమిషనర్లు స్వీపింగ్ మిషన్ల పనితీరును స్వయంగా పరిశీలించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని మేయర్ హెచ్చరించారు. డిప్యూటీ కమిషనర్లు ప్రజా ఫిర్యాదులపై చాలా మర్యాదపూర్వకంగా నిర్ణీత సమయంలో పరిషరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్ఈ చిన్నారెడ్డి, సిటీ ప్లానర్ ఉమాదేవి, ఏఎంసీ శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రశాంతి, నాగమణి, మంగతయారు, రవికుమార్, రవీందర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.