ఇక్కడి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవు.?
ప్రజలకు మంచిచేయాలనే ఆలోచన ఉంటే రండి.. శిక్షణ ఇస్తాం
రైతు బంధు సంబురాల్లో మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్/శామీర్పేట, జనవరి10(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ పాలన వ్యవస్థపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, శామీర్పేట్, కీసర, ఘట్కేసర్, మూడుచింతలపల్లి మండలాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సంబురాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. రైతుబంధు పథకంతోనే ప్రతి పల్లె మురుస్తుందన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి రైతుబంధు సంబురాల్లో పాల్గొంటున్నారని, 10 రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చినట్లు అనిపిస్తుందన్నారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రికి రైతాంగం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై మాట్లాడే ముందు మీ పరిపాలనను అంచనా వేసుకోవాలని ప్రతి పక్షాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ హారికమురళీ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, మద్దుల శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్రెడ్డి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి మున్సిపాలిటీల్లో..
మంగళవారం నుంచి మున్సిపాలిటీల్లో రైతుబంధు వారోత్సవాలను నిర్వహించనున్నారు. బోడుప్పల్, పోచారం, ఘట్కేసర్, దమ్మాయిగూడ, జవహర్నగర్లో రైతుబంధు వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రదర్శించనున్నారు.
మా దగ్గరకు రండి.. శిక్షణ ఇస్తాం..
“బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, నిరంతరం ఉచిత విద్యుత్, ఇంటింటికీ తాగునీరు, కల్యాణలక్ష్మి ఆసరా పింఛన్ వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదు..? బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు? బీజేపీ సీఎంలు, మంత్రులు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను తెలుసుకుని అవగాహన పెంచుకోండి. అవసరమైతే మీ రాష్ర్టాల్లో కూడా అమలు చేయండి. అందుకు మా దగ్గరకు రండి.. శిక్షణ ఇస్తాం.” అని మంత్రి మల్లారెడ్డి బీజేపీ నేతలకు చురకలంటించారు.