రైతుల అభివృద్ధిని చూసి ఓర్వలేకనే..బీజేపీ నేతల కుట్రలు, కుతంత్రాలు
మీరు పాలిస్తున్న రాష్ర్టాల్లో..ఒక్కటైనా అమలు చేస్తున్నారా.?
రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
సంక్రాంతిని మరిపించిన రైతుబంధు సంబురాలు
దేశ చరిత్రలోనే ఒక సువర్ణ దినం
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, జనవరి 10 : ఢిల్లీలో రైతులను చంపిన బీజేపీ పార్టీ.. గల్లీలో గగ్గోలు పెడుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతును రాజుగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలో రైతుబంధు సంబురాల్లో భాగంగా మన్సాన్పల్లి చౌరస్తా నుంచి మహేశ్వరం రైతు వేదిక వరకు రైతులు, గిరిజనులతో కలిసి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ రైతు బంధు పథకం ద్వారా రైతుల అకౌంట్లలో రూ.50 వేల కోట్లు వేసిన సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. రైతు బంధు సంబురాలు సంక్రాంతి పండుగను మరిపించాయని, ఇది దేశ చరిత్రలోనే ఒక సువర్ణ దినమని చెప్పారు. రైతు బాంధవుడుగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోతారని తెలిపారు. సంబురాల్లో ఇంత పెద్ద ఎత్తున రైతులు, గిరిజనులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
బీజేపీ నేతలకు కనబడత లేదా..?
సీఎం కేసీఆర్ ఉన్నారనే ధైర్యంతోనే రైతులు సంతోషంగా సాగుబడి చేసుకుంటున్నారని అది చూసి ఓర్వలేని పక్క రాష్ర్టాల నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ నేతలకు కనబడత లేదా..? మీరు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఈ పథకాలు ఒక్కటైనా అమలు చేస్తున్నారా..? ఢిల్లీలో రైతులను చంపిన పార్టీ నేతలే.. గల్లీలో మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా.. రైతుల నుంచి, తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ను విడదీయలేరని అన్నారు. రైతులు, సబ్బండ ప్రజల ఆశీర్వాదాలే సీఎం కేసీఆర్ సర్కార్కు శ్రీరామరక్ష అని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు వెన్నుగా నిలిచిన కేసీఆర్ను యావత్ దేశ రైతాంగం ప్రశంసిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతాఆంధ్యానాయక్ పాల్గొన్నారు.