వరి కొయ్యలను సేంద్రియ ఎరువుగా మారిస్తే సిరులు
70 శాతం ఎరువులు తగ్గుతాయ్..
కాల్చివేస్తున్న మెజార్టీ రైతులు.. తద్వారా పర్యావరణ కాలుష్యం..
సారం దెబ్బతింటుదంటున్న వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు
మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోయి పంట దిగుబడి తగ్గే ప్రమాదం
అగ్ని ప్రమాదాల వల్ల రైతుల ఆరోగ్యానికి హాని
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ
నిర్మల్ టౌన్, డిసెంబర్ 8 : గతంలో కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. ప్రస్తుతం యంత్రాలు అందుబాటులోకి రావడంతో మొదళ్ల వరకు కాకుండా 25-30 సెంటీమీటర్ల ఎత్తలో కోస్తున్నాయి. దీంతో గడ్డి కొయ్య కాళ్ల రూపంలో పంట అవశేషంగా మిగులుతున్నది. వీటిని రైతులు మడిలోనే తగుల బెడుతున్నారు. ఇది పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నది. కాల్చడం వల్ల అపార నష్టాలున్నయంటూ శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నా మెజార్టీ రైతులు వరికొయ్యలను కాల్చుతూనే ఉన్నారు. తద్వారా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లు అవుతున్నది. ఈ విధానం వల్ల ప్రకృతి దెబ్బతినడమేకాదు, అన్నదాత అన్ని రకాలుగా నష్టపోతున్నాడు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోవడమేకాదు, సారవంతమైన భూమి దెబ్బ తినడంతోపాటు దిగుబడిపై కూడా ప్రభావం చూపుతున్నది. ఫలితంగా వాతావరణం కలుషితం అవుతున్నది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే.. వరి కొయ్యలే సిరులు కురిపిస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు.
ఒకప్పుడు కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. అప్పట్లో దొడ్డి నిండా పశువులు ఉండడం వల్ల వాటి మేత కోసం గడ్డి పోచను కూడా విడిచి పెట్టకుండా.. ఎండబెట్టి కుప్పవేసి ఏడాదంతా పశువులకు మేతగా ఉపయోగించే వారు. ఇప్పుడు పశువులు లేకుండా పోయాయి. రైతుకు గడ్డి అవసరం లేకుండా పోయింది. వరికోత యంత్రాలు వచ్చిన తదుపరి గడ్డిని కుప్పవేసే రైతులను వేళ్లపై లెక్కపెట్టే పరిస్థితులు వచ్చాయి. మారిన ప్రపంచీకరణ నేపథ్యంలో.. ప్రస్తుతం రైతులు వరి పంట కోతకు యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ యంత్రాలు వరి నేలకు దగ్గరగా అంటే మొదళ్ల వరకు కాకుండా 25-30 సెంటీమీటర్ల ఎత్తులో కోస్తున్నాయి. దీంతో గడ్డి కొయ్యకాళ్ల రూపంలో పంట అవశేషంగా మిగులుతున్నది. అలాగే పంట కోసిన తర్వాత మిగిలిన గడ్డిని, ఇది వరకు రైతులు పశువులకు మేతగా వినియోగించేవారు. ఇప్పుడు పశువుల సంఖ్య తగ్గడం వల్ల వరి గడ్డి కూడా వ్యర్థ పదార్థంగా మారి పంట అవశేషంగానే మిగిలిపోతున్నది. పంటకు-పంటకు మధ్య సమయం తక్కువ ఉండడంతో వరి కోసిన తర్వాత మిగిలిన కొయ్యకాళ్లు, వరిగడ్డిని కంపోస్టుగా మార్చుకోవడంపై రైతులకు అవగాహన లేకపోవడంతో వీటిని తగుల పెడుతున్నారు. దీని వల్ల పొలంలో ఉన్న కీటకాలను, వ్యాధికారక జీవులు నశింపచేయవచ్చన్న అపోహతో చాలా మంది రైతులు వరి కొయ్యకాళ్లను, గడ్డిని తగలబెడుతున్నారు.
జీవామృతం తయారీ ఇలా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ప్రస్తుతం రైతులు వరి కోతకు హార్వెస్టర్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వరి కోత తర్వాత మార్కెట్లో రూ.20 దొరికే ఒక లీటరు వేస్టు కంపోజర్(ఆవుపేడ, మూత్రం, గో ఆధారిత బ్యాక్టీరియాతో తయారైంది) 200 లీటర్ల నీటిలో కలపాలి. ఇందులో రెండు కిలోల బెల్లం వేసి మూడు రోజులు మురుగబెట్టాలి. అనంతరం తడి మడులలో స్ప్రే చేస్తే వరి కొయ్యలు మురిగి సేంద్రియ ఎరువుగా మారుతాయి. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. ఇది రెండు కాంప్లెక్స్ ఎరువుల బస్తాల(రూ.2400)తో కూడిన ఎరువుకు సమానం. అంటే రూ.2,400 విలువ చేసే కాంప్లెక్స్ ఎరువులను వరి కొయ్యల ద్వారా కేవలం రూ. 100తో ఉపయోగించుకునే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. బెల్లం, వేస్టు కంపోజర్ ఉపయోగించడం వల్ల భూసారం దెబ్బతినదు. తీపి గుణం ఉండటం వల్ల వానపాములు పొలంలోకి చేరతాయి. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు.
సేంద్రియ ఎరువు తయారుచేసుకోవచ్చు..
నిర్మల్ జిల్లాలో రైతులు వరి కోత తర్వాత వరి కొయ్యలను కాల్చకుండా సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకునేందుకు వేస్టు డి కంపోజర్ విధానంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల భూమిలోని సూక్ష్మధాతువులు, భూసారం, తేమ దెబ్బతిని రైతులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కేవలం రూ.100తో రెండు కాంప్లెక్స్ ఎరువులతో సమానంగా సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. – ఎం ప్రవీణ్కుమార్(వ్యవసాయశాఖ అధికారి, సోన్)
కలియ దున్నినా.. కుప్ప పెట్టినా.. బంగారమే..
వరిపంట కోసిన వెంటనే కొయ్యకాళ్లను తగలబెట్టకుండా పొలంలో మిగిలిన తేమను ఉపయోగించుకుని దున్నాలని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. దున్నడం వల్ల కొయ్యకాళ్లు మట్టితో కప్ప బడి కుళ్లే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తద్వారా సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వేసవిలో నేలలో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి తొలకరిలో పడిన వర్షపునీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేలకోతకు గురికాకుండా ఉంటుంది. ఒక టన్ను వరి గడ్డి కావాలంటే.. ఆ వరి పెరుగుదలకు 18.9 కిలోల పోటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతోపాటు కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్ని తిరిగి నేలకు చేరతాయి. లేదా ఈ పంట అవశేషాల వ్యర్థాలను కంపోస్టు చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. వాన కాలంలో దమ్ము చేసేటప్పుడు ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేస్తే నేలలో మిగిలిపోయిన వరికొయ్యలు తొందరగా కుళ్లిపోతాయి. తర్వాత నాటే వరి పంటకు నేల ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి.
అనేక నష్టాలు..
వరి కొయ్యలను తగుల పెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ కారణంగా శీతాకాలంలో తీవ్రస్థాయిలో కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడిచేస్తున్నాయి. ఇలా తగలబెట్టడం వల్ల నేలలోని పోషక గుణాలు నష్టపోవడమే కాకుండా మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా సూక్ష్మజీవులు పంటకు వేసే ఎరువులను మొక్కలకు అందిస్తాయి. కానీ కొయ్యలను తగుల పెట్టడంతో అవి చనిపోవడంతో రైతులు వేసే ఎరువులు మొక్కకు అందే అవకాశం లేకుండా పోతున్నది. కొయ్యకాళ్లను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం, కార్బన్ డై ఆక్సైడ్గా మారి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుంది. పొగ, ధూళికణాలు గాలిలో కలవడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పొలాలలో తిరిగే ముంగిసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోతున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఇది సాగుకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.