నేడు విన్నవించేందుకు రైతులు, రైతు సంఘాల సన్నాహాలు
సిద్ధమవుతున్న హమాలీలు, ఇతర కార్మిక సంఘాలు
అడ్వకేట్లు, ప్రజాసంఘాలు కూడా..
గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యోచన
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 07 (నమస్తే తెలంగాణ) : యాసంగి సీఎంఆర్ సేకరణలో జాప్యం కారణంగా ప్రస్తుత కొనుగోళ్లకు ఆటంకాలు ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర గవర్నర్ తమిళ్సై నల్లగొండ పర్యటనకు వస్తున్నారు. బుధవారం నల్లగొండలోని సంతోషిమాత ఆలయ పునప్రారంభంలో పాల్గొన్న అనంతరం ఆర్జాలబావి, అనిశెట్టిదుప్పలపల్లిల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న గవర్నర్ను కలిసి రాష్ట్రంతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎఫ్సీఐ తీరుపై పిర్యాదు చేసేందుకు జిల్లాలోని రైతులు, రైతు సంఘాలు, హమాలీ, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ సేకరణలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని గవర్నర్ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ సీజన్లో ఎఫ్సీఐ తీరు తీవ్ర ఆటంకంగా మారిందని, దీని వల్ల యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని మిల్లుల నుంచి ఖాళీ చేయడం సాధ్యం కావడం లేదని తెలపనున్నారు. తక్షణమే అవసరమైన గోదాంలను తీసుకుని, రైల్వే వ్యాగన్లను కేటాయించి బియ్యాన్ని సేకరించేలా చూడాలని విన్నవించాలని అనుకుంటున్నారు. దీంతో పాటు వచ్చే యాసంగిలోనూ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రం ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా విన్నవించాలని చూస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ తీరు, దాని పరిధిలో పని చేసే ఎఫ్సీఐ వ్యవహారశైలిపై పూర్తి వివరాలను సిద్దం చేస్తున్నారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు, ఎఫ్సీఐ వైఖరిపై ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న గవర్నర్ తమిళ్సైకి వివరించాలని భావిస్తున్నట్లు సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ తెలిపారు. అదేవిధంగా సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కూడా స్పందిస్తూ తమ పార్టీ రైతుసంఘం ఆధ్వర్యంలోనూ గవర్నర్ను కలువనున్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ వ్యవహారశైలిపై తమ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డితో కలిసి గవర్నర్కు విన్నవిస్తామన్నారు. ఇక యాసంగిలో ధాన్యం కొనబోమంటున్న కేంద్ర ప్రభుత్వ తీరుతో వేలాది మంది హమాలీలు రోడ్డున పడుతారని హమాలీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హమాలీలు, మిల్లు డ్రైవర్లు, సిబ్బంది కూడా గవర్నర్ను కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇక రైతు సేవా కేంద్రాల ప్రతినిధులు, ఎలైట్ ఫార్మర్స్ గ్రూప్స్ ప్రతినిధులు, అడ్వకేట్స్తో కూడిన రైతు ప్రతినిధులు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలోనూ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలంటూ గవర్నర్ ద్వారా విన్నవించాలని సన్నద్ధ్ద్దం అవుతున్నారు. తక్షణమే ఎఫ్సీఐ అవసరమైన గోదాంలను తీసుకుని మిల్లుల్లో ఉన్న సీఎంఆర్ బియ్యాన్ని సేకరించి రైల్వే వ్యాగన్ల ద్వారా వాటిని తరలించేలా చూడడం, మరోవైపు యాసంగిలోనూ ధాన్యం కొనేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర రైతాంగం తరపున ఒత్తిడి తెచ్చేలా గవర్నర్ తమిళ్సైని కలువడానికి సిద్ధ్ద్దమవుతున్నారు.