బీబీనగర్ / బొమ్మలరామారం, డిసెంబర్ 7 : మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బీబీనగర్ మండలంలోని కొండమడుగు, బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామ రైతులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రైతులు మార్కెట్లో డిమాండ్కు తగ్గట్లు వరికి బదులు వేరుశనగ, మినుములు, రాగులు, ఉలవలు, పత్తి, పండ్ల తోటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలన్నారు. రైతులు పండించే పంటలకు కెమికల్స్ బదులు సహజ సిద్ధమైన ఎరువులు వాడాలని సూచించారు. హైదరాబాద్ నగరం దగ్గర ఉన్నందున ప్రతి గ్రామంలోనూ రైతులందరూ కలిసి సమావేశమై పంటల మార్పిడి, మార్కెటింగ్పై చర్చించుకోవాలని సూచించారు. వేపచెట్లకు డై బ్లాక్ డిసీజ్ సోకుతున్నందున మండల వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో కార్బన్డిజం స్ప్రే చేసి కాపాడాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్పై అప్రమత్తంగా ఉండేందుకు ప్రజలందరూ రెండోడోసు టీకా తీసుకోవాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులు, వలస కూలీలందరికీ వివిధ సంక్షేమ పథకాలు అందించేందుకు ఈశ్రమ్లో నమోదు చేసుకుని కార్డు పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి అన్నపూర్ణ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి అనూరాధ, ఎంపీపీ సుధాకర్, వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆల్వ మోహన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీవాణి, ఎంపీఓ స్వాతి, ఏఓలు పద్మ, సైదులు, సర్పంచ్ బట్కీర్ బీరప్ప, కొం డోజు ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు.