అబిడ్స్, డిసెంబర్ 4 : జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని అన్ని సర్కిల్లలో నూతన రహదారుల నిర్మాణ పనులను చేపడుతున్నారు. సీఆర్ఎంపీ, ఇంజినీరింగ్ విభాగం ద్వారా వీడీసీసీ, సీసీ, బీటీ రహదారుల నిర్మాణ పనులను చేపడుతున్నారు. రోడ్ల నిర్మాణ పనులు పూర్తైన తర్వాత టేబుల్ డ్రైన్ సీసీ నిర్మాణం, రోడ్ లేన్ మార్కింగ్, జీబ్రా క్రాసింగ్ లేన్ మార్కింగ్ పనులను చేపడుతున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ నేతృత్వంలో ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ పర్యవేక్షణలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు నాణ్యతతో అభివృద్ధి పనులను చేయిస్తున్నారు. వర్షాలతో దెబ్బతిన్న రహదారులలో నూతన రహదారుల నిర్మాణం, కొన్ని ప్రాంతాల్లో గుంతల పూడ్చివేత, ప్యాచ్వర్క్ పనులను చేపడుతున్నారు. నూతన రోడ్లను నిర్మిస్తుండడంతో స్థానికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు..
ముస్లింజంగ్ వంతెన నుంచి మొజాంజాహి మార్కెట్ వరకు, టోలిచౌకీ నుంచి షేక్పేట్ వరకు, యాదవ్ భవన్, గుడిమల్కాపూర్ నుంచి కార్వాన్ లేబర్ అడ్డ, జిర్రా నుంచి టప్పాచబుత్రా, మురాద్నగర్ లేబర్ అడ్డ నుంచి ఆసిఫ్నగర్ మెయిన్ రోడ్డు, లంగర్హౌస్ ఫ్లై ఓవర్ నుంచి ఫతే దర్వాజ సీఆర్ఎంపీ ద్వారా రహదారుల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం నుంచి సుజాత స్కూల్ వరకు, సరోజిని దవాఖాన, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే ప్రాంతం తదితర ప్రాంతాల్లో నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.