ప్రారంభం కానున్న కొత్త మద్యం దుకాణాలు
సంగారెడ్డి జిల్లాలో 101, సిద్దిపేటలో 93, మెదక్లో 49 షాపులు
ఈ నెల 20న లాటరీ ద్వారా కేటాయించిన అధికారులు
ప్రతీ దుకాణంలో మూడు సీసీ కెమెరాలు
అన్ని వసతులు సమకూర్చుకున్న వ్యాపారులు
రిజర్వేషన్ కోటాలో షాపులు దక్కించుకున్న ఎస్సీ, ఎస్టీ, గౌడలు
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు
మెదక్/సిద్దిపేట టౌన్, నవంబర్ 30 : నూతన మద్యం పాలసీని గతంలో కంటే భిన్నంగా ప్రభుత్వం రూపొందించింది. అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఏర్పాటైన కొత్త మద్యం పాలసీకి విశేష స్పందన ఆశావహుల నుంచి లభించింది. నయా మద్యం పాలసీ వ్యాపారుల్లో కొత్త జోష్ నింపింది. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ ఏర్పాటైన పాలసీ అందరి మనసులను చూరగొంది. పది రోజుల పాటు టెండర్ల ప్రక్రియ జిల్లాలో జోరుగా కొనసాగింది. లాటరీ విధానం ద్వారా దుకాణాలను ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లాలో 101, సిద్దిపేటలో 93, మెదక్లో 49 షాపులు ప్రారంభం కానున్నాయి. రిజర్వేషన్ కోటాలో ఎస్సీ, ఎస్టీ, గౌడలు షాపులు దక్కించుకోగా, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు సాగనున్నాయి.
నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం కొత్త మద్యం దుకాణాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మంగళవారం రాత్రితో పాత వైన్స్ల కాలపరిమితి ముగిసింది. చాలా వరకు వైన్స్ల్లో మద్యం నిల్వలు అయిపోయాయి. మెదక్ జిల్లాలోఇటీవల లాటరీ పద్ధతిలో 49 మద్యంషాపులు కేటాయించిన విషయం తెలిసిందే. గతంలో కంటే వైన్స్లు దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
832 దరఖాస్తుల ద్వారా రూ.16.64 కోట్ల ఆదాయం
ప్రభుత్వ ఆదేశాల మేరకు వైన్స్లకు గతంలో మాదిరిగానే డ్రా పద్ధతిలో కేటాయించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 49 వైన్స్లు ఉండగా 832 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈ సారికూడా దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండడంతో పెద్ద ఎత్తున మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా మొత్తం 832 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ..16.64 కోట్ల ఆదాయం వచ్చింది. డ్రా పద్ధతిలో వైన్స్లు కేటాయించగానే దుకాణాదారుల నుంచి స్లాబ్ల రూపంలో ప్రభుత్వానికి రూ.4.35 కోట్లు వచ్చాయి.
నిబంధనలు అతిక్రమిస్తే దుకాణాల సీజ్..
ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు అతిక్రమిస్తే వైన్స్లను సీజ్ చేయనున్నారు. మున్సిపాలిటీలతో పాటు ఇతర ప్రాంతాల్లో బడి, గుడి, దవాఖానలకు 100 మీటర్ల దూరంలో వైన్స్లు ఉండాలి. మున్సిపాలిటీల పరిధిలో రహదారుల పక్కన వైన్స్లు ఏర్పాటు చేసుకున్నప్పటికీ మిగతా చోట్ల మాత్రం ఆ అవకాశం లేదు. జాతీయ, రాష్ట్ర రహదారులకు దాదాపు 220 మీటర్ల దూరంలో వైన్స్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్లోనే మద్యం ఆర్డర్..
మంగళవారం రాత్రితో పాత వైన్స్ల గడువు ముగిసింది. బుధవారం నుంచి కొత్త వైన్స్లు తెరుచుకోనున్నాయి. ఎక్సైజ్ కార్యాలయం నుంచి లైసెన్స్ తీసుకున్న వారికి మాత్రమే ఆన్లైన్లో మద్యం ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలోని 49 దుకాణాల వారీగా యజమాని పేరున అధికారులు లైసెన్స్లు అందించారు. ఆన్లైన్లో కూడా ఆ వివరాలు పొందుపరుస్తారు. ప్రతి వైన్స్కు సంబంధించిన యూజర్ పేరు, పాస్వర్డ్ ఇస్తారు. వాటి ఆధారంగా ఆన్లైన్లో మద్యం బుక్చేసుకొని డిపోల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి దుకాణంలో మూడు సీసీ కెమెరాలు..
కొత్త దుకాణాల్లో ఈ సారి తప్పకుండా మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టారు అధికారులు. ఈ కెమెరాలను జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు దుకాణాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో జరిగే ప్రతీది రికార్డు కానున్నది. ఇలాంటి నిబంధనలు గతంలో ఉన్నా వ్యాపారులు పాటించలేదు. కొన్ని దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఒకటి రెండు నెలల్లోనే అవి పనిచేయకుండాపోయాయి. అధికారులు తనిఖీలకు వస్తున్న సమయంలోనే హడావుడి చేస్తూ ఆ తర్వాత అంతా మర్చిపోయేవారు. పర్యవేక్షణ కొరవడడంతో కొందరు వ్యాపారులు లూజు అమ్మకాలు చేపట్టి అందినకాడికి దండుకున్నారు. మళ్లీ అలాంటి సంఘటనలు తలెత్తకుండా ఈ సారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే దుకాణాల ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలనే నిబంధన పెట్టి ఎక్సైజ్శాఖ ఆదేశాలు జారీ చేసింది.
మద్యం కల్తీ చేస్తే దుకాణాలు సీజ్
మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలి. నిబంధనలు అతిక్రమించొద్దు. గుడి, బడి, దవాఖానకు దూరంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. మద్యాన్ని కల్తీ చేసి విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయించినా, 21 సంవత్సరాల్లోపు వారికి మద్యం అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వ్యాపారులందరూ నిబంధనలు పాటించాలి. జిల్లాలో వాకిన్ స్టోర్ ఏర్పాటుకు వ్యాపారులు ముందుకొస్తున్నారు. వాటిని ఏర్పాటు చేయాల్సిన వారు అదనంగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వస్తున్నది. – విజయ్భాస్కర్రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ , సిద్దిపేట జిల్లా
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.డిసెంబర్ 1వతేదీ నుంచి కొత్త దుకాణాలు తెరుచుకుంటాయి. పాత వైన్స్ల యజమానులు మద్యం మిగిలితే తిరిగి డిపోల వద్ద అప్పగించాలి. ప్రతి వైన్షాపు వద్ద కనీసం మూడు సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలి. ఎక్సైజ్ కార్యాలయం నుంచి లైసెన్స్ తీసుకున్న వారు మాత్రమే ఆన్లైన్లో మద్యం ఆర్డర్ చేసుకునే అవకాశం ఉన్నది. జిల్లాలో 49 మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్ అందించాం.
-ఎంఎ రజాక్, ఎక్సైజ్శాఖ సూపరింటెండెంట్, మెదక్ జిల్లా