న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆయన ఈ అంశంపై గురువారం మాట్లాడారు. సోషల్ మీడియాల్లోని అసభ్యకర, పోర్న్ కాంటెంట్కు పిల్లలు బలి అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఫ్లాట్ఫామ్లను బాధ్యతాయుతంగా వాడాలని, యువతను కాపాడుకునేందుకు కఠినమైన ఆంక్షలను విధించాలని హర్భజన్ తెలిపారు. ప్రస్తుత దశలో సోషల్ మీడియా అనేది ఓ కీలకమైన సమాచార యంత్రంగా మారినట్లు భజ్జీ తెలిపారు. అయితే అనుచిత సమాచారాన్ని అధిక మొత్తంలో సర్క్యూలేట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇన్స్టాగ్రామ్ లాంటి ఫ్లాట్ఫామ్పై హర్బజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు యూజర్లు సాఫ్ట్ పోర్నోగ్రఫీ కాంటెంట్ను షేర్ చేస్తున్నారని, అది పిల్లలకు కూడా యాక్సెస్లో ఉందని అన్నారు. కేవలం ఒక్క క్లిక్తోనే అశ్లీల సమాచారం వచ్చేస్తోందని ఆరోపించారు. 12 ఏళ్లు ఉన్న చిన్నారులు కూడా తమకు తెలియకుండానే అలాంటి అశ్లీల కాంటెంట్ను యాక్సిస్ చేస్తున్నారని పేర్కొన్నారు. యుక్త వయసులోనే పిల్లలు ఇలాంటి కాంటెంట్ను చూడడం వల్ల వాళ్ల భవిష్యత్తు నాశనం అవుతోందని భజ్జీ తెలిపారు. పోర్నోగ్రఫీ కాంటెంట్ ఈజీగా దొరకడం వల్ల ఇది తీవ్ర సామాజిక సమస్యగా మారినట్లు హర్భజన్ పేర్కొన్నారు.
ఇలాంటి కాంటెంట్ను ఎక్కువగా వీక్షించడం వల్ల .. మహిళల పట్ల యువతలో చెడు ఆలోచనలు వస్తాయన్నారు. మహిళలను చులకనగా చూడడమే కాకుండా, పిల్లల ప్రవర్తనలో నెగటివిటీ వస్తుందని, వారు పెరుగుతున్న కొద్దీ మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతారని హర్భజన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాల్లో జోక్యం చేసుకుని, కఠినమైన ఆంక్షలను, డిజిటల్ రూల్స్ను తయారు చేయాలని కోరారు. పోర్నోగ్రఫీ వెబ్సైట్లను బ్యాన్ చేయాలని, ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లను మరింత పటిష్టంగా రెగ్యులేట్ చేయాలని, ఇలాంటి కాంటెంట్ వల్ల సమాజానికి ఎటువంటి లబ్ధి చేకూరదని, దీని వల్ల మానసికంగా, సామాజికంగా నష్టం జరుగుతుందని భజ్జీ ఆందోళన వ్యక్తం చేశారు.