సూర్యాపేట, మార్చి 18(నమస్తే తెలంగాణ) : ‘దుక్కి ఉంటేనే దిక్కు ఉంటది. నాగలి సాగితేనే ఆకలి తీరుతది’ అని బలంగా నమ్మే కేసీఆర్ సర్కారు మరోమారు రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ ఆత్మను చాటింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనుల పూర్తికి రూ.వందల కోట్లు కేటాయించింది. నాగార్జునసాగర్ ఆయకట్టు మినహా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల బీడు బీములను సస్యశ్యామలం చేసేందుకు డిండి ఎత్తిపోతలకు రూ.540కోట్లు, ఎస్ఎల్బీసీకి రూ.331కోట్లు, నృసింహా రిజర్వాయర్ (బస్వాపూర్)కు రూ.500కోట్లు కేటాయించింది. సాగర్, యూసీ ప్రాజెక్టుల మరమ్మతులకు మరో రూ.89కోట్లు ప్రతిపాదించింది. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు ఇటీవల మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాలను ప్రస్తావించి చివరి ఆయకట్టు రైతాంగంలో భరోసా నింపింది.
మరోవైపు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి రూ.50కోట్ల మేర లబ్ధి చేకూరనున్నది. నాలుగున్నర లక్షల మందికి రూ.600కోట్ల రుణమాఫీ కానున్నది. 13.90 లక్ష మందికి పంట పెట్టుబడి సాయంగా రైతు బంధు అందనున్నది. గ్రామ స్వరాజ్యానికి జవసత్వాలూదే నిర్ణయాలు, సీఎం దళిత్ ఎంపర్మెంట్ ప్రోగ్రామ్, వృత్తిదారులకు చేయూత, మహిళా, శిశు సంక్షేమానికి పెద్దపీట, పట్టణ ప్రగతికి ప్రాధాన్యం, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం, ఆర్టీసీ బలోపేతం, మండల, జిల్లా పరిషత్లకు నిధులు కేటాయింపుపై అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం తొలిసారి రాష్ట్ర బడ్జెట్ నుంచే నెలనెలా ‘పల్లెప్రగతి’ నిధులు కేటాయించడం విదితమే. ఈ సారి కూడా రూ.500కోట్లు కేటాయించగా ఇందులో జిల్లా పరిషత్కు రూ.252కోట్లు, మండల పరిషత్కు 248కోట్లు కేటాయించనున్నారు. రూ.4,000కోట్లతో సరికొత్త విద్యా పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. వైద్య రంగానికి ఏకంగా 6,295కోట్లు ప్రతిపాదించడం గమనార్హం.
సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులకు రూ.331కోట్లు, ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు నిధులు కేటాయించారు. డిండి ఎత్తిపోతల పథకానికి భారీగా నిధులు కేటాయించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మెయింటెనెన్స్, ఇతరత్రాల కోసం రూ.80కోట్లు, సూర్యాపేట జిల్లాలోని మూసీ నదికి రూ.9కోట్లు కేటాయించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.960కోట్లు కేటాయించగా ఈ ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని దాదాపు 30వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఇక జంటనగరాలకు తాగునీటిని ఉద్దేశించి చేపడుతున్న సుంకిశాల ప్రాజెక్టుకు రూ.725కోట్లు కేటాయించారు. ఈ మార్గంలోని దాదాపు 1100గ్రామాలకు ఇప్పటికే భగీరథ నీరందుతున్నది.
రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు నిధులు…
ఔటర్ రింగురోడ్డుకు వెలుపల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగురోడ్డుకు 30కిలోమీటర్ల పరిధిలో 348కి.మీ. మేర రోడ్డు నిర్మించనున్నారు. భూ సేకరణ కోసం రూ.750 కోట్లు కేటాయించారు. ఇప్పటికే భూముల ధరలకు రెక్కలు రాగా రీజినల్ రింగురోడ్డు భూ సేకరణ జరిగితే మరింత పెరిగే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల రైతులు, సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.