ప్రజల్లో పెరుగుతున్న అవగాహన
కరోనా టీకా వేసుకునేందుకు ఉత్సాహం
రెండో విడుతలో ఇప్పటివరకు 5,144 మందికి వ్యాక్సిన్
విద్యానగర్, మార్చి 13: ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ వైరస్ను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు విడుతల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. మొదటి విడుతలో రెండు దశల్లో వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన వారికి సేవలను అందించిన వైద్యులు, వైద్యసిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రైవేటు దవాఖానల వైద్యులు, సిబ్బందికి మొదటి విడుతలో టీకా వేశారు. రెండో దశలో మున్సిపల్ కార్మికులు, సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. రెండో విడుత(2.0)లో 60 ఏండ్లు పైబడిన వారితో పాటు 45 నుంచి 59 ఏండ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు వేశారు. మొదటి విడుతలో తక్కువ మంది టీకాలు వేసుకున్నా.. రెండో విడుతలో టీకా తీసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. రెండో విడుతలతోనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ టీకాను వేయించుకున్నారు.
ప్రతి కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు..
వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బందిని నియమించారు. ప్రతి కేంద్రంలో వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్, పర్యవేక్షణ కోసం మూడు గదులు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని 30 నిమిషాల పాటు ప్రత్యేకంగా అబ్జర్వేషన్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
4,022 మందికి మొదటి విడుత మొదటి డోస్..
కామారెడ్డి జిల్లాలో మొదటి విడుత కరోనా టీకాలను జనవరి 16వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు వేశారు. మొదటి డోసు టీకాను 4,022 మంది వైద్య సిబ్బందికి వేశారు. వ్యాక్సిన్ను వైద్యసిబ్బందితో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ప్రైవేటు వైద్యులు, సిబ్బందికి అందజేశారు. జిల్లాలో మొదటి విడుతగా 29 కేంద్రాలను టీకా వేసేందుకు ఏర్పాటు చేసి ప్రతి కేంద్రంలో 50 మందికి పైగా వ్యాక్సిన్ వేశారు. మొదటి విడుతలో రెండో దశ వ్యాక్సిన్ను ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వేశారు. ఇందులో 991 మంది పోలీసులు, 895 మంది మున్సిపల్ కార్మికులు, 215 రెవెన్యూ శాఖ సిబ్బంది, 988 మంది పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి కలిపి మొత్తం 3089 మంది టీకా తీసుకున్నారు.
3,564 మందికి మొదటి విడుత రెండో డోస్..
మొదటి విడుత మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి 28 రోజుల అనంతరం రెండో డోస్ వేయడం ప్రారంభించారు. ఇందులో 3,564 మంది వైద్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందు కోసం జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 524 మంది పోలీసు సిబ్బంది, 219 మంది మున్సిపల్ కార్మికులు, 190 మంది రెవెన్యూ ఉద్యోగులు, 200 మంది పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది కలిపి మొత్తం 3089 మందికి మొదటి విడుత రెండో డోస్ టీకా వేసుకున్నారు.
రెండో విడుతలో 5,144 మందికి..
రెండో విడుతలో సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభించారు. రెండో విడుతలో భాగంగా 60 ఏండ్లు పైబడిన వారితో పాటు 45 నుంచి 59 ఏండ్లలోపు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి వ్యాక్సిన్ వేశారు. జిల్లావ్యాప్తంగా 60 ఏండ్లు పైబడిన వారిలో 3,605 మందికి, 45 నుంచి 60 ఏండ్లలోపు దీర్ఘకాలిక సమస్యలు కలిగిన వారికి 1,539 మందికి వ్యాక్సినేషన్ వేశారు. టీకా తీసుకునేందుకు మొదట్లో చాలా మంది భయపడినా.. క్రమంగా వారిలో అవగాహన పెరుగుతున్నది. దీంతో టీకా తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
టీకాపై అపోహలు వద్దు..
కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన టీకాలపై ఎలాంటి అపోహలు వద్దు. టీకా సురక్షితమైనది. ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. రెండో విడుతలో 60 ఏండ్లు పైబడిన వారితో పాటు 45 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు కలిగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రిజిస్ట్రేషన్ చేసుకొని టీకాలు తీసుకోవాలి.