కార్పొరేషన్, మార్చి 15: మ్యాన్హోల్స్, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేందుకు పూర్తిస్థాయిలో యంత్రాలను వినియోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత నవంబర్లో సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్ను చేపట్టింది. పోటీలో గెలిచిన మొదటి మూడు నగరాలకు భారీగా నగదు బహుమతులను అందించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయా రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో చాలెంజ్లో పాల్గొనేందుకు నగరాలు ముందుకు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలను మూడు విభాగాలుగా చేసిన కేంద్రం 243 నగరాలను ఎంపిక చేసి పోటీకి సిద్ధం చేసింది. వీటితో కరీంనగర్ నగరపాలక సంస్థ కూడా పోటీ పడుతున్నది. చాలెంజ్లో గెలుపొందేందుకు జోరుగా యత్నిస్తున్నది. ఇప్పటికే పాలకవర్గం చురుకుగా కార్యక్రమాలను చేపడుతున్నది. ఇప్పటికే యంత్రాలను కొనుగోలు చేయడంతో పాటు వినియోగిస్తున్నది. ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతున్నది.
చాలెంజ్ విధానం ఇలా..
జనాభాను అనుసరించి నగరాలను మూడు విభాగాలు చేశారు. 3లక్షల లోపు జనాభా ఉన్న నగరాలు, 3నుంచి 10 లక్షల వరకు ఉన్న నగరాలు, 10 లక్షలకు పైగా ఉన్న నగరాలు. వీటిలో కరీంనగర్ నగరపాలక సంస్థ 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాలతో పోటీ పడుతున్నది. పోటీలో నెగ్గితే మొదటి బహుమతిగా రూ.8కోట్లు, రెండో బహుమతిగా రూ.3 కోట్లు, మూడో బహుమతిగా రూ.2 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. సుమారు వెయ్యి మార్కుల ఈ చాలెంజ్లో ప్రజల భాగస్వామ్యం, అవగాహనకు 150, సోషల్ మీడియాను అందుబాటులో ఉంచేందుకు 50, యంత్రాల పనితీరుకు 400, యంత్రాల వినియోగం, కార్మికులకు పీపీఈ కిట్లకు 100 మార్కులు కేటాయించారు. అలాగే ఇకో సిస్టమ్ పారామీటర్ కింద 300 మార్కులు కేటాయించారు. ఈ చాలెంజ్కు సంబంధించి ఈ నెల 31లోగా ఆయా నగరాలు పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి పనులు చేపట్టాల్సి ఉండగా మే నుంచి జూన్ వరకు కేంద్ర ప్రభు త్వం నియమించిన ప్రతినిధులు ఆయా నగరాల్లో పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. వీటి ఆధారంగానే విజేతలను ఆగస్టు 15న ప్రకటిస్తారు.
పనులను ప్రారంభించిన బల్దియా
పోటీలో గెలిచేందుకు బల్దియా ఇప్పటికే భూగర్భ డ్రైనేజీలకు సంబంధించిన మ్యాన్హోల్స్ను శుభ్రం చేసేందుకు వీలుగా జెట్టింగ్ యంత్రాన్ని కొనుగోలు చేసి వినియోగిస్తున్నది. డ్రైనేజీల్లోని సిల్ట్ను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాన్ని కూడా ఉపయోగిస్తున్నది. అలాగే నగరంలోని అన్ని సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ వాహన యజమానులతో మాట్లాడిన నగరపాలక సంస్థ పూర్తిగా పర్యవేక్షణ బాధ్యత చేపట్టింది. ఇందుకు టోల్ ఫ్రీ నంబర్ 14420ను తీసుకువచ్చింది. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ యంత్రాలు సేకరించిన వ్యర్థాలను ఎస్టీపీ ప్లాంట్కు తరలించి రీసైక్లింగ్ చేపడుతారు. పనులను సక్రమంగా చేపట్టేందుకు నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్ రెస్పాన్స్ యూనిట్ (ఎస్ఆర్యూ)ను కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్కు వచ్చే కాల్స్ను స్వీకరించేందుకు ప్రత్యేకంగా కంప్యూటర్తో పాటు సిబ్బందిని ఉంచారు. పనుల పర్యవేక్షణకు శానిటేషన్, సెప్టిక్ క్లీనింగ్ సిబ్బందితో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్కు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఇప్పటికే హోర్డింగ్లు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. మనుషులతో ఎవరైనా మానవ వ్యర్థాలను క్లీనింగ్ చేపడితే భారీగా జరిమానా విధిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు.
ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం
సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్లో ముందు వరుసలో ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నాం. సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ వ్యవహారాన్ని పూర్తిగా బల్దియా ద్వారానే పర్యవేక్షణ చేయడంతో పాటు వ్యర్థాలను ఎస్టీపీకి తరలిస్తున్నాం. ఎక్కడెక్కడ సెప్టిక్ ట్యాంకులను క్లీనింగ్ చేస్తున్నాం.. ఎంత స్థాయిలో వ్యర్థాలు వస్తున్నాయి.. తదితర వివరాలను రికార్డు చేయిస్తున్నాం. మానవ వ్యర్థాలను యంత్రాలతోనే తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.