కన్నుల పండువగా లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఊరేగింపు
భారీగా తరలివచ్చిన భక్తులు
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే కాలె యాదయ్య
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
చేవెళ్ల టౌన్, మార్చి13: లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి దోపోత్సవం కన్నుల పండువగా జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి 9గంటల నుంచి శనివారం తెల్లవారుజాము వరకు చేవెళ్ల మండల కేంద్రంలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి దోపోత్సవాన్ని నిర్వహించారు. దోపోత్సవాన్ని దేవాలయ ప్రాంగణం నుంచి స్వామి వారి పుష్కరిణి వరకు ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలివేలు మంగమ్మను సైతం పుష్కరిణి వరకు తీసుకొచ్చారు. అనంతరం చెంచు వారి ఆటపాటల మధ్య స్వామి ఆభరణాలు దోచుకున్నారు. దోపోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కూడా దోపోత్సవాన్ని తిలకించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. దోపోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా సీఐ నేతృత్వంలో, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మీ రమణారెడ్డి, సర్పంచ్ శైలజా అగిరెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, దేవస్థానం మేనేజర్లు శ్రీనివాస్లు, పూజారులు, వివిధ గ్రామాల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేవెళ్ల లక్ష్మీ వేంకటేశ్వర స్వామి పుష్కరిణి వద్ద ఎర్రోళ్ల్ల శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ బృందం నిర్వహించిన కీర్తనలు, భజనలు ఆకట్టుకున్నాయి.
వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే యాదయ్య
మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. శనివారం స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. టీఆర్ఎస్ నాయకులు మంగలి యాదగిరి, శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. అనంతరం యాదగిరి, శ్రీధర్ రెడ్డి చేవెళ్ల పంచాయతీకి వైకుంఠ రథాన్ని విరాళం ఇచ్చారు. ఈ రథాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాల్రాజ్, నాయకులు, భక్తులు ఉన్నారు.