యాదాద్రి, మార్చి 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మించారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలాలయ ముఖ మండపంలో ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏఈఓ శ్రవణ్కుమార్ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ యాదాద్రీశుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణతో స్వయంభువుల దర్శనం ప్రారం భం కావడం సంతోషంగా ఉందన్నారు. యాదాద్రికి గోదావరి జలాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఆయన వెంట టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య ఉన్నారు.