యాదాద్రి, ఏప్రిల్ 30 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్య క్షేత్రంలో శనివారం నిత్యపూజల సందడి కొనసాగింది. స్వయంభూ పాంచనారసింహుడికి నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు చేశారు. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8గంటలకు స్వయంభూ ప్రధానాలయంలోని ప్రాకార మండపంలో సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు.
స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామి, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలను అర్చకులు ఘనంగా నిర్వహించారు.
క్యూ కాంప్లెక్స్ చెంత కొలువైన క్షేత్ర పాలక ఆంజనేయ స్వామికి జరిగిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్రత మండపంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామి నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు రూ.14,84,683 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రాకారంలోని అద్దాల మండపం వద్ద అర్చకులు మేయర్కు ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ స్వామివారి ప్రసాదం అందించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,13,600
వీఐపీ దర్శనం 60,000
వేద ఆశీర్వచనం 9,600
నిత్యకైంకర్యాలు 300
సుప్రభాతం 7,100
క్యారీబ్యాగుల విక్రయం 20,000
వ్రత పూజలు 56,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 16,800
ప్రసాద విక్రయం 8,47,150
వాహనపూజలు 7,000
అన్నదాన విరాళం 21,983
సువర్ణ పుష్పార్చన 1,59,000
లక్ష్మీ పుష్కరిణి 800
యాదరుషి నిలయం 76,370
పాతగుట్ట నుంచి 24,980
లీసెస్, లీగల్ 9,000