సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. భగభగ మండుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం నల్లగొండ జిల్లా కనగల్లో 45.7, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, మునగాలలో 45.2, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఉదయం 9 నుంచి మొదలవుతున్న ఎండ సెగ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతున్నది. వడగాలుల ప్రభావంతో జనం ఇంటి పట్టునే ఉంటూ కూలర్లు, ఏసీల కింద సేదతీరుతున్నారు. ఎండలకు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఉదయం 9గంటలకే వేడి మొదలవుతుండడంతో జనం అల్లాడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెలలో ఎలా ఉంటుందో..! అని బెంబేలెత్తుతున్నారు. శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 45.2డిగ్రీలు, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 45.1 డిగ్రీలు, నల్లగొండ జిల్లాలో 43డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం వేళ భగభగ మండుతున్న ఎండల్ని చూసి ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. దాంతో సాయంత్రం 5గంటలకు కూడా రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల కారణంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పది గంటల దాకా వేడి గాలుల ప్రభావం ఉంటున్నది. కరెంటు కోతలు లేకపోవడంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలతో ఉపశమనం చెందుతున్నారు.
– భువనగిరి కలెక్టరేట్/అడ్డగూడూరు, ఏప్రిల్ 30
వేసవి ఆరంభం నుంచి నల్లగొండ జిల్లాతో పోలిస్తే సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం నల్లగొండలో సగటు ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదు కాగా, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. నల్లగొండలో గత ఏడేండ్లలో అటవీ శాతం గణనీయంగా పెరిగింది. హరితహారానికి తోడు అటవీ అభివృద్ధి, సంరక్షణ చర్యలతో పచ్చదనం పెరిగి వేసవి తాపం తగ్గినట్లు వాతావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో గడిచిన ఏడేండ్లలో చేపట్టిన హరితహారం కార్యక్రమాల ద్వారా అటవీ విస్తీర్ణం 9 నుంచి 27శాతానికి పెరిగింది. వాస్తవానికి 33శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా విభజనకు ముందు 4శాతం కలిగిన అటవీ విస్తీర్ణం ప్రస్తుతం నల్లగొండలో 9.09శాతం, సూర్యాపేటలో 6శాతం, యాదాద్రి జిల్లాలో 4శాతం ఉన్నది.
భానుపురి భగ్గుమంటున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో నెత్తిన కుంపటి పెట్టిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజులుగా సూర్యుడు ప్రతాపం చూపుతుండగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం అత్యధికంగా మునగాల, తిరుమలగిరి పరిధిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మొదటి పది ప్రాంతాల్లో సూర్యాపేట జిల్లా 9వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 40 నుంచి 45.2 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అర్వపల్లి మండల కేంద్రంలో యాగానందం అనే రైతు తన వ్యవసాయబావి వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్పూల్ యువత, చిన్నారులకు వేసవి తాపం తీరుస్తున్నది. వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నారులు పొద్దంతా ఇక్కడే ఉండి ఈత నేర్చుకుంటున్నారు. స్విమ్మింగ్పూల్ చుట్టూ పచ్చని అందమైన మొక్కలను పెంచడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. చిన్నారులకు, యువకులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేయడంతో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈత నేర్పిస్తున్నారు.
– అర్వపల్లి, ఏప్రిల్ 30
నల్లగొండ జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణలో తొలగించిన భారీ వృక్షాలకు మళ్లీ జీవం పోస్తున్నారు. ఏండ్ల నాటి వేప, చింత, రాగి, మర్రి వృక్షాలను వేర్లతో సహా పెకిలించి క్రేన్ల సాయంతో ట్రక్కుల్లో తరలించి చర్లపల్లిలోని అర్బన్ పార్కులో నాటారు. ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో ఆగస్టులోగా 200పైగా చెట్లు నాటనున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో వాటికి గ్రీన్ షేడ్ ఏర్పాటు చేశారు. నరికిన కొమ్మల నుంచి తేమ ఆవిరి కాకుండా ఆకు పచ్చని వస్ర్తాన్ని కప్పి ఉంచారు.
– నీలగిరి, ఏప్రిల్ 30
జనం ఎండలు తాళలేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చల్లదనం కోసం ఇండ్ల పైకప్పులో జమ్ము కప్పుకొంటున్నారు. శనివారం చిలుకూరు మండలంలో కారుపై జమ్ముగడ్డిని తరలిస్తున్న దృశ్యం నమస్తే కెమెరాకు చిక్కింది.
ప్రాంతం ఉష్ణోగ్రత(డిగ్రీల్లో)
అడ్డగూడూరు 45.1
చౌటుప్పల్ 44.7
వెంకిర్యాల (బీబీనగర్) 44.6
ఆత్మకూరు(ఎం) 44.5
యాదగిరిగుట్ట 44.5
మర్యాల (బొమ్మలరామారం) 44.2
గుండాల 44.0
దత్తప్పగూడెం (మోత్కూరు) 43.8
వలిగొండలో 43.7
రామన్నపేట 43.5
రాజపేట 43.0
సంస్థాన్ నారాయణపురం 42.7
నందనం (భువనగిరి) 42.6
కొలనుపాక (ఆలేరు) 42.6
భువనగిరి 42.4
మోటకొండూరు 42.0
బొమ్మలరామారం 42.0
జలాల్పుర్ (పోచంపల్లి) 41.1
తుర్కపల్లి 40.7