భనవ నిర్మాణాల అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే అమల్లో ఉన్న తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్(టీఎస్-బీపాస్)ను గ్రామపంచాయతీల్లోనూ అమలు చేసేందుకు నిర్ణయించింది. ఆ మేరకు ఉత్తర్వులను విడుదల కాగా, త్వరలోనే మార్గదర్శకాలు సైతం రానున్నాయి. దాంతో జిల్లాలోని 421 గ్రామపంచాయతీల్లో టీఎస్-బీపాస్ ద్వారా భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియ అమల్లోకి రానున్నది. దరఖాస్తుదారులు మీసేవ ద్వారా ధ్రువపత్రాలు, ఇంటి ప్లాన్ టీఎస్ బీపాస్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే, అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అన్నీ నిబంధనల ప్రకారం ఉంటే 21 రోజుల్లో అనుమతి ఇవ్వనున్నారు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టాలంటే ఇకపై టీఎస్-బీపాస్ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మున్సిపాలిటీల్లోనే టీఎస్ బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టం)అమలులో ఉంది. తాజాగా గ్రామాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇది అమలులోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో తప్పనిసరిగా ఇళ్ల నిర్మాణాలకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పంచాయతీ పరిధిల్లో టీఎస్ బీపాస్కు అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. దీనిపై పంచాయతీ అధికారులకు, సిబ్బందికి అవగాహన కలిగించేందుకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం అమలులోకి వస్తే నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా ఇంటి నిర్మాణానికి అనుమతి లభిస్తున్నది.
– సునంద, డీపీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా
ఇప్పటి వరకు గ్రామాల్లో భవన నిర్మాణానికి పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేస్తే సర్పంచి, కార్యదర్శి పరిశీలించి ఈ-పంచాయతీ ద్వారా అనుమతి ఇచ్చేవారు. తాజాగా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం..టీఎస్-బీపాస్ ద్వారా అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో ఈ విధానం అమలవుతుండగా.. ఇదే పద్ధతిని గ్రామాల్లోనూ అమలుచేయడం ద్వారా నిర్మాణాల వివరాలు, పన్ను వసూలు పకడ్బందీగా జరగనుంది. దరఖాస్తుదారులు మీసేవ ద్వారా అన్ని రకాల ధ్రువపత్రాలు, ఇంటిప్లాన్ పొందుపరిచి టీఎస్ బీపాస్లో అప్లోడ్ చేయగానే సంబంధిత శాఖల అధికారులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. పంచాయతీరాజ్, నీటి పారుదల, ఇంజినీరింగ్ శాఖల పరిశీలన అనంతరం సంబంధిత దరఖాస్తుకు 21 రోజుల్లో అనుమతి లభిస్తున్నది. అనుమతిలేని నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్మించినవి, ధ్రువపత్రాలు సక్రమంగా లేని కట్టడాలు ఉంటే వాటిని నోటీసు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాన్ని పాలకవర్గాలకు ఈ చట్టం అవకాశం కల్పిస్తున్నది.