చిట్టడవులకు ప్రఖ్యాతిగాంచిన జపాన్ ‘మియావాకీ’ పద్ధతికి బదులుగా రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘యాదాద్రి మోడల్ జంగల్’ పేరే వినిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహాలో అడవులను సృష్టించాలని సంకల్పించిన ప్రభుత్వం రెండేండ్లలో జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలన్నింటిల్లోనూ చిట్టడవులను సృష్టించింది. వీటివల్ల కలిగిన సత్ఫలితాలతో ప్రతి మండలంలో నాలుగైదు చొప్పున ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాల్లోనూ యాదాద్రి మోడల్ను అనుసరించి ప్లాంటేషన్ చేపట్టనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 355 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించగా ఇప్పటికే 145 చోట్ల స్థలాల ఎంపిక పూర్తయ్యింది. ఈ వనాలు త్వరలోనే కార్యరూపంలోకి రానుండడంతో ఇక ఎక్కడ చూసినా ‘యాదాద్రి మోడల్’ జంగల్లే సాక్షాత్కరించనున్నాయి.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పచ్చదనంతో పాటు అటవీ విస్తీర్ణం పెంపు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడవులను సృష్టించేలా గ్రామ పంచాయతీలతోపాటు వాటి అనుబంధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు చాలావరకు వినియోగంలోకి వచ్చాయి. తాజాగా.. ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతి మండలంలో ఆహ్లాదంతోపాటు పర్యావరణాన్ని పెంపొందించేందుకు 6 నుంచి 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో వనానికి రూ.40లక్షల ఉపాధి హామీ నిధులతోపాటు, నిర్వహణ కోసం గ్రామపంచాయతీ నిధులను వెచ్చించనున్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు సంబంధించి 1,094 ఎకరాలను సంబంధిత అధికారులు గుర్తించారు. ఇంకా మిగతా వనాలకు సంబంధించి స్థలాల గుర్తింపు కొనసాగుతున్నది.
ఏర్పాటు ఇలా…
ఒక్కో బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం కొన్ని మండలాల్లో పది ఎకరాలను, స్థలం కొరత ఉన్న చోట ఆరెకరాలకు తగ్గకుండా ఎంపిక చేశారు. ప్రతి వనంలోనూ 20 రకాల మొక్కలను 31 వేల వరకు నాటుతారు. నిమ్మ, దానిమ్మ, జామ, సీతాఫలం, కరివేపాకు వంటి చిన్న మొక్కలతోపాటు టేకు, ఇప్ప, పనస, ఉసిరి, కుంకుడు, నేరేడు, వేప, చింత, వెలగ, చందనం, అందుగు, రేగు, నెమలినార వంటి పెద్ద వృక్షాలను ‘యాదాద్రి మోడల్ జంగల్స్’ తరహాలో పెంచుతారు. ఆయుర్వేదానికి సంబంధించి పొడపత్రి, పారిజాతం, తంగేడు, అడ్డసరం, గోరింట, తిప్పతీగతోపాటు వనం చుట్టూ కంచె ఏర్పాటుకు బదులుగా వెదురు, గచ్చకాయ, గోరింట వంటి మొక్కలు నాటనున్నారు. నాలుగు భాగాలుగా విభజించి 6,925 మొక్కల చొప్పున 6.86 ఎకరాల్లో మొక్కలను ఏర్పాటు చేస్తుండగా.. 0.75 ఎకరాల్లో పిల్లల కోసం ఆటస్థలం, నడక దారికి 0.69 ఎకరాలు, కంచె ఏర్పాటుకు 0.14 ఎకరాలను కేటాయిస్తున్నారు.
‘యాదాద్రి జంగల్స్’ అంటే..!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ దగ్గర తంగేడువనం అర్బన్ ఫారెస్టు పార్క్లో ఎకరం భూమిలో పెంచిన మియావాకి అడవి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచింది. 2018 సెప్టెంబర్లో ‘యాదాద్రి న్యాచురల్ ఫారెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రాం’ను అందుబాటులోకి తెచ్చి మియావాకి విధానంలో అటవి అభివృద్ధిని చేపట్టారు. ఇందుకుగాను బీడు భూమిని సుపోషకంగా మార్చేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించారు. భూమి లోపల ఆరు పొరల్లో వివిధ దశల్లో మొక్కల ఎదుగుదలకు అనుగుణంగా మార్చారు. అడుగుకు ఒక్క మొక్క చొప్పున నాలుగు వేల వరకు వివిధ రకాల మొక్కలను నాటి మొక్కల ఎదుగుదలను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులను కల్పించారు. కేవలం 45 రోజుల్లోనే ఎకరం భూమిలో చిట్టడవిని సృష్టించారు. ఉసిరి, సీతాఫలం వంటి ఫలాలు కాస్తుండగా.. జీవ వైవిధ్యానికి సైతం ఈ ప్రాంతం నిలయంగా మారింది. రకరకాల క్రిములు, కీటకాలు ఇక్కడకు చేరుతుండగా.. కొన్నేండ్ల కిందట కనుమరుగై పోయిన రింగన్న పురుగులు ఈ చిట్టడవిలో సాక్షాత్కరిస్తున్నాయి. వివిధ జాతుల పక్షుల గూళ్లతోపాటు, రకరకాల సీతాకోక చిలుకలు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడ సక్సెస్ కావడంతో సీఎం కేసీఆర్ దీనికి ‘యాదాద్రి మోడల్’గా నామకరణం చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై ఉన్న ఈ వనం అటుగా వెళ్లే ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నది.