తెలంగాణలో దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రైతుబంధు తరహాలోనే.. దళిత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించారు. తొలుత జిల్లాలో తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో దళితబంధు పథకాన్ని అమలు చేసిన సీఎం.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అర్హులైన వారందరికీ దళిత బంధు పథకం ద్వారా నేరుగా సాయం అందించేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులైన దళితులతోపాటు, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకూ దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన దళిత ఉద్యోగ వర్గాల్లో సంతోషాన్ని నింపుతున్నది. ఈ పథకంలో బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా ఉద్యోగుల కుటుంబాలకూ రూ.10లక్షల నగదు సాయం అందనున్నది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఆయా వర్గాల్లో సర్వత్రా హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సంక్షేమ పథకాల అమలుతో సబ్బండ వర్ణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషితో దళితుల జీవితాలు కూడా మెరుగుపడుతూ వస్తున్నాయి. అయితే సామాజికంగా, ఆర్థికంగా శతాబ్దాల కాలంగా వివక్షతకు గురవుతూ వస్తున్న దళిత కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధపెట్టి బాగు చేసుకోవాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ విప్లవాత్మక రీతిలో కార్యాచరణను అమలు చేయాలని సంకల్పించారు. దళితులను పేదరికం నుంచి బయడపడేసేందుకు ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో కార్యాచరణ మొదలైంది. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 17లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తున్నారు. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి చెందిన 76 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున అందించేందుకు రూ.7.60కోట్లను జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసి ఉంచారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి రూ.500కోట్లు మంజూరు చేశారు. పథకం అమలును పర్యవేక్షించడం, ఆ తర్వాత ఫలితాలను అంచనా వేయడం, లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం వంటి మూడు ముఖ్యమైన అంశాల ఆధారంగా దళితబంధు పథకాన్ని అమలు చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఎలాంటి బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రూ.10లక్షల చొప్పున నగదు సాయాన్ని పూర్తి గ్రాంటు రూపంలో అందజేయనున్నారు. రైతుబంధు తరహాలో దలితబంధు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ఆర్థికసాయాన్ని ప్రభుత్వం జమ చేయనున్నది. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ వేదికగా చేసిన ప్రకటనతో దళితబంధు సాయం దళిత ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకూ అందనున్నది. దళిత బంధుతో లబ్ధిపొంది ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం ఏదైనా పరిస్థితిలో ఆపదకు గురైతే రక్షణ నిధి ద్వారా ఆ కుటుంబాన్ని దీనస్థితి నుంచి బయటపడేసేలా దళితబంధు పథకానికి కార్యరూపం ఇస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని త్వరలోనే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది. ప్రభుత్వ ఉద్యోగస్తులైన దళితులు, రిటైర్డ్ ఉద్యోగుల్లో అర్హులైన వారందరికీ చివరి వరుసలో దళితబంధు సాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది.
తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అమలు చేయ సంకల్పించిన ‘దళితబంధు’ పథకం పట్ల జిల్లాలోని దళిత ఉద్యోగ కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దళిత మేధావులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం నాంది పలుకుతుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక సంక్షోభంలోనూ దళిత జాతి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కంకణం కట్టుకోవడం హర్షణీయమని కొనియాడుతున్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ తపన అమోఘమని, దళిత సమాజం ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటుందని దళిత ఉద్యోగ సంఘా లు పేర్కొంటున్నాయి.
గుండాల, ఆగస్టు 17: రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం దళిత బంధు పథకం తీసుకురావడం హర్షణీయం. ఉద్యోగులకు సైతం దళితబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బాగుంది. ఉద్యోగం ఉన్నప్పటికీ దళిత ఉద్యోగులు కొంత మంది పేదరికంలో ఉన్నారు.
తుర్కపల్లి, ఆగస్టు 17 : దళిత వర్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేన్నవారి సంఖ్య తక్కువ. కొద్దిమంది మాత్రమే చిన్నాచితక ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారిని అతికష్టం మీద తల్లిదండ్రులు కూలీ పనులు చేసి చదివించడంతో ఆ మాత్రం ఉద్యోగాలను చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నం. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు వర్తిస్తుందని చెప్పడం మంచి పరిణామం.
సంస్థాన్నారాయణపురం , ఆగస్టు 17 : దళితబంధు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ దళిత బాంధవుడిగా చిరకాలం గుర్తిండిపోతారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం దళితల సంక్షేమం కోసం ఆలోచించలేదు. కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే వినియోగించుకున్నారు. అందుకు భిన్నంగా దళితబంధు ప్రవేశపెట్టి రూ.10లక్షలు కేటాయించడం హర్షణీయం.
ఆలేరు టౌన్, ఆగస్టు 17 : దళిత అభ్యున్నతికి సర్కారు పాటుపడుతుంది. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేయడం హర్షణీయం. దళితబంధు ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం వచ్చి జీవన ప్రమాణాలు పెరుగనున్నాయి. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా సీఎం కేసీఆర్ పక్కాగా అమలు చేస్తారు. దళితబంధు పథకంతో కేసీఆర్ దళితుల పక్షపాతిగా చరిత్రకు ఎక్కారు. దళితుల బాగు గురించి ఆలోచించి మంచి స్కీంను ప్రవేశపెట్టారు.
యాదాద్రి, ఆగస్టు 17 : ఇన్నేండ్లుగా దళితులకు బాసటగా నిలిచిన నాయకుడు రాలే. కేవలం ఓట్ల కోసమే దళితులను వాడుకుని వదిలేశారు. చాలీచాలని డబ్బులతో ఒక పూట పస్తులుండి హాస్టళ్లలో ఉంటూ చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన మేము ఇప్పటికీ ఆర్థికంగా ఎదగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు సైతం దళితబంధును వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనతో మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆరే దళితుల నిజమైన బంధువు.