ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన కాజీపేట్ టూ నాగ్పూర్ ప్యాసింజర్ రైలు పునఃప్రారంభంలో అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతున్నది. దాదాపు ఉమ్మడి పది జిల్లాల్లోని 20 స్టేషన్ల పరిధిలో ప్రయాణికులకు సేవలందించిన ఈ ట్రైన్ను ఆదాయం లేదనే సాకుతో రెండేళ్ల కింద నిలిపివేయగా, ఆ రూట్లో ఉద్యోగులు, విద్యార్థులు, పాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ముఖ్యంగా పాత కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల వాసులకు ఎంతో దోహదపడే ఈ రైలును మళ్లీ నడిపించాలని ఎన్నో డిమాండ్లు వస్తున్నా పట్టని కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీల తీరు విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికైనా స్పందించి, రైలును పునరుద్ధరించాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
పెద్దపల్లి, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోని 20 స్టేషన్ల పరిధిలోని ప్రయాణికులను నిరంతరం గమ్య స్థానాలకు చేర్చిన కాజీపేట్ టూ నాగ్పూర్ ప్యాసింజర్ పునఃప్రారంభంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తున్నది. రైలు సేవలు నిలిచిపోయి రెండేళ్లయినా మళ్లీ ప్రారంభానికి మోక్షం కలుగకపోవడం, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీలు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఐదు దశాబ్దాలుగా సేవలు..
కాజీపేట్- నాగ్పూర్ ప్యాసింజర్ రైలు ఇప్పటిది కాదు. ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్కి చెందిన ఈ రైలు, 57135/36 నంబర్తో కాజీపేట్ నుంచి వయా పెద్దపల్లి – మంచిర్యాల – సిర్పూర్ కాగజ్ నగర్ – బల్లార్షా- సేవా గ్రామ్ మీదుగా అజ్నీ (నాగ్పూర్) దాకా వెళ్లేది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్, మధ్య రైల్వే జోన్ పరిధిలో మొత్తం 444 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. ఈ ట్రైన్ యొక ప్రాథమిక నిర్వహణ కాజీపేట జంక్షన్ నుంచి జరిగేది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని 20 స్టేషన్ల మీదుగా నడిచేది. తెలంగాణలో రైల్వే స్టేషన్లు హసన్పర్తి రోడ్డు, ఉప్పల్, జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొతపల్లి, ఓదెల, కొలనూర్, కొత్తపల్లి, పెద్దపల్లి జంక్షన్, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట్, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, రేచ్ని రోడ్డు, ఆసిఫాబాద్ రోడ్డు, సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ టౌన్ రైల్వే స్టేషన్లలో ఆగేది.
ఈ రైలుది పెద్ద చరిత్రే..
ఈ ప్యాసింజర్ను మొదట్లో నాగ్పూర్ నుంచి హైదరాబాద్ మధ్య నడిపారు. తర్వాత కాజీపేట దాకా కుదించారు. నాగ్పూర్ నుంచి కాజీపేట దాకా ఈ ప్యాసింజర్కు ప్రత్యామ్నాయంగా 30 ఏండ్ల క్రితం వార్దా జంక్షన్ నుంచి కాజీపేట జంక్షన్ దాకా నూతన ప్యాసింజర్ రైలును ప్రారంభించారు. కొన్ని రోజులకు ఈ రైలును సిర్పూర్ కాగజ్నగర్ దాకా కుదించారు. ఆ తర్వాత బల్లార్షా వరకు పరిమితం చేశారు. 2008లో నాగ్పూర్ నుంచి కాజీపేట ప్యాసింజర్ రైలును విజయవాడ దాకా పొడిగించగా, ఆ తర్వాత కొన్ని రైల్వే యూనియన్ల గొడవలతో తిరిగి ఎప్పటిలాగే నడిపారు. ఇక 2019 జూలై నుంచి కేవలం బల్లార్షా నుంచి కాజీపేట దాకా మాత్రమే నడుపగా, బల్లార్షా నుంచి నాగ్పూర్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఇలా సుమారుగా కరోనా మొదటి దశ మార్చి 2020 వరకు నడిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైలును పునః ప్రారంభించలేదు.
ఎంతో మందికి వారధి..
తెలంగాణలోని 20స్టేషన్లలోని ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేది. ఇది ఉదయం పూట విద్యార్థులు, ఉద్యోగస్తులు, రోజువారీ కార్మికులకు (ముఖ్యంగా పాల వ్యాపారులకు, పూల వ్యాపారులకు) కాజీపేట వెళ్లేందుకు భాగ్యనగర్ సెమీ ఎక్స్ ప్రెస్రైలుకి ప్రత్యామ్నాయంగా పనిచేసేది. పైగా ఈ రైలులో ఉదయం కాజీపేట జంక్షన్లో దిగితే అకడ నుంచి సికింద్రాబాద్ వెళ్లడానికి విజయవాడ వైపు నుంచి వచ్చే విశాఖ-ముంబైఎక్స్ ప్రెస్ రైలు, గోలొండ ఎక్స్ ప్రెస్ రైలుతో ప్రయాణికులను అనుసంధానం చేసేది. అలాగే తిరుగుపయనంలో కాజీపేట నుంచి నాగ్పూర్ వెళ్లేటప్పుడు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి పద్మావతి (12764), చార్మినార్ (12760) సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో కాజీపేట దాకా వచ్చి ఇకడ నుంచి పెద్దపల్లి వైపు వెళ్లే ప్రయాణికులకు ఈ నాగపూర్ ప్యాసింజర్ రైలు అనుసంధానంగా ఉండేది. ఈ రైలుకు ఇరువైపులా ప్రయాణికులతో మంచి ఆదరణ ఉండేది. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడేది. ఇలా ఎంతో మందికి సేవలందించిన ట్రైన్ను, ఆదాయం లేదనే సాకుతో దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు 57135/36 కాజీపేట నుంచి నాగ్పూర్ ప్యాసింజర్ను మార్చి 2020లో నిలిపివేశారు.
ప్రయాణికులకు తిప్పలే..
ఈ రైలు రద్దయి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పునరుద్ధరణ కాలేదు. ఈ రైలు ప్రారంభించాలని ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు కోరుతున్నారు. అయినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ఈ రైలు పునఃప్రారంభం గురించి ఎటువంటి ప్రకటన చేయడం లేదు. ఉదయం కాజీపేట వైపు భాగ్య నగర్ సెమీ ఎక్స్ ప్రెస్ రైలు తర్వాత మధ్యాహ్నం ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు వరకు మధ్యలో ఎటువంటి రైలు లేదు. సుమారుగా 8 గంటల వ్యవధిలో ఏ ఒక్క రైలు లేదు. అదే విధంగా సాయంత్రం కాజీపేట జంక్షన్లో పెద్దపల్లి వైపు సాయంత్రం 5:45 గంటలకు భాగ్యనగర్ సెమీ ఎక్స్ప్రెస్ రైలు తర్వాత ఉదయం 5:20 వరకు వచ్చే రామగిరి స్పెషల్ ట్రైన్ మధ్యలో ఏ ఒక రైలు లేదు. దాదాపుగా 12 గంటల వ్యవధిలో ఒక్క రైలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పెద్దపల్లి వైపు కాజీపేట జంక్షన్లో రాత్రి 1:10 గంటలకు దక్షిణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఉండగా, ఈ రైలుకు కరోనా కంటే ముందు జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లలో స్టాప్ ఉండేది. ఈ రైలు పునః ప్రారంభం తర్వాత పలు స్టాప్లను తొలగించారు. ఈ స్టేషన్లలో ప్రస్తుతం ఈ దక్షిణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు కేవలం మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్లలో మాత్రమే ఆగుతున్నది.
పట్టని కేంద్రమంత్రి.. బీజేపీ ఎంపీలు
తెలంగాణలోని 20 రైల్వే స్టేషన్ల మీదుగా వేలాది మందిని తరలించే కాజీపేట నుంచి నాగ్పూర్ ప్యాసింజర్ను అర్ధంతరంగా నిలిపివేయడంతో ఈ రూట్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దగ్గర దగ్గరగా రెండేళ్ల కాలంగా ఈ రైలు సేవలు పూర్తిగా నిలిపివేసినా బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్రెడ్డిగానీ, బీజేపీ ఎంపీలుగానీ పట్టించుకోవడం లేదు. ఈ ప్యాసింజర్ సేవల కొనసాగింపుపై ఏ ఒక్కనాడూ కేంద్ర రైల్వే మంత్రినిగానీ రైల్వే శాఖ అధికారులను గానీ కలువలేదు. ఇప్పటికైనా రైలు పునరుద్ధరణపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించుకునే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రయాణికుల కోసం ఈ ప్రాంత ఎంపీలుగా ఉన్న బండి, అర్వింద్, బాబూరావు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.