పరిగి, అక్టోబర్ 8 : ఆహార కొరతతో మరణాలు సంభవించకుండా అరికట్టేందుకు పేదలకు రేషన్ బియ్యం అందజేస్తున్నట్లు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2కోట్ల90లక్షల మందికి పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మానవ సంపదను కాపాడుకోవడానికే ఆహార భద్రత చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు. మద్గుల్చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన తిరుమలరెడ్డి ముఖ్య అతిథిగా జిల్లాస్థాయి జాతీయ ఆహార భద్రత చట్టంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా తిరుమలరెడ్డి మాట్లాడుతూ.. ఆహార కొరత, పౌష్టికాహార లోపంతో మరణాలు సంభవిస్తున్నాయని, దీంతో ప్రతి ఒక్కరికి ఆహారం అందించడం, అవసరమైన వారికి పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఆహార భద్రత చట్టం తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారంతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం జరిగితే కేసీఆర్ కిట్, ఆడశిశువు జన్మిస్తే రూ.13వేలు, మగశిశువు జన్మిస్తే రూ.12వేలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
పీడీఎస్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మందికి రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సదుపాయాలు పకడ్బందీగా అమలయ్యేలా చూసేందుకు గ్రామ, మండల, జిల్లాస్థాయిల్లో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి నెల సమావేశాలు జరుపాలన్నారు. అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకే ఈ కమిటీలు వేయాలని, లబ్ధిదారులు ఈ కమిటీల పనితీరుతో సంతృప్తి చెందకుంటే ఫుడ్ కమిషన్ను సంప్రదించవచ్చని తెలిపారు. రేషన్ దుకాణం దూరంగా ఉన్న గ్రామాల్లో నెలకు కనీసం 5 రోజులు రేషన్ సరుకుల సరఫరా జరిగేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలోని 19 మండలాల్లో 588 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 8,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. జిల్లాలో కొత్తగా 7,488 రేషన్ కార్డులు అందజేసినట్లు చెప్పారు. జిల్లాలో 1023 పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు. పౌష్టిక విలువలు గల కోడిగుడ్డు, పప్పు, కూరగాయలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లాలోని 1106 అంగన్వాడీ కేంద్రాల్లో 53,224 మంది చిన్నారులు, 870 మంది గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని జిల్లా వైద్యాధికారి తుకారాంభట్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, ఆర్డీవోలు ఉపేందర్రెడ్డి, అశోక్కుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, సర్పంచ్లు పాల్గొన్నారు.