దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వచ్చే మార్చి నెలలోపు ఒక్కో నియోజకవర్గంలో వంద నిరుపేద కుటుంబాలకు ‘దళితబంధు’ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఎలాంటి పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా ఎంపిక చేసి, నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో రూ.10లక్షలను ప్రభుత్వం జమ చేయనున్నది. నచ్చినచోట, నచ్చిన వ్యాపారం చేసుకునేలా లబ్ధిదారుడికి వెసులుబాటునూ కల్పించింది. ఒక్కొక్కరుగా, లేదంటే బృందంగా ఏర్పడి వ్యాపారం చేసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లాలో 36 లక్షల మంది దళిత జనాభా ఉండగా, వికారాబాద్ జిల్లాలో 21.91 శాతం దళితులు ఉన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఒక్కో నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలను ఎంపిక చేయనున్నారు. వంద శాతం సబ్సిడీతో ‘దళితబంధు’ను అమలు చేస్తున్నందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దళితుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.
పరిగి/షాబాద్, అక్టోబర్ 5 : రాష్టంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. వారు తమ కాళ్లపై తాము నిలబడేందుకు నేరుగా సాయం చేయనుంది. ఇందులో భాగంగా దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుండగా.. ఇటీవల రాష్ట్రంలోని నాలుగు మండలాలు సైతం పైలెట్ ప్రాజెక్టు కింద ప్రకటించిన ప్రభుత్వం దళిత కుటుంబాలకు దళిత బంధు అందించనుంది. మార్చి లోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ పలుచోట్ల దళిత నాయకులు కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఒక్కో నియోజకవర్గంలో వంద కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సాయం అందించనుంది. పథకం అమలులో పైరవీకారులకు తావు లేకుండా ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేయనుంది. ప్రభుత్వ లైసెన్సులు అవసరమయ్యే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఎం ప్రకటించారు. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలతోపాటు చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం., రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు(కల్వకుర్తి) నియోజకవర్గాలున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో 21.91 శాతం దళితులు, రంగారెడ్డి జిల్లాలో 36లక్షల మంది ఉన్నారు.
ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలు.. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు..
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు అందించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వంద మంది లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయా గ్రామాల్లో మొదట నిరుపేదలైన దళితులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుంది.
వచ్చే ఏడాది 2వేల కుటుంబాలకు..
వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23లో ప్రతి నియోజకవర్గంలో 2వేల మందికి లబ్ధి చేకూరనుంది. వచ్చే బడ్జెట్లో దళిత బంధుకు 20వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ లెక్కన ప్రతి మండలంలో 300 నుంచి 400 కుటుంబాల వరకు ఈ పథకం ద్వారా వచ్చే ఏడాది ప్రయోజనం పొందనున్నారు. ఈసారి లబ్ధిపొందేవారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సర్కారు అందజేస్తున్న సహాయంతో ప్రతి నియోజకవర్గంలో కొత్త కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకోనున్నారు.
ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు..
దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందినవారు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. తమకు నచ్చిన యూనిట్ను ఎంపిక చేసుకునే అవకాశం వారికే ఉంది. ఒకరు స్వంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. లేదంటే లబ్ధిదారులు బృందంగా ఏర్పడి పెద్ద పరిశ్రమను నెలకొల్పుకోవచ్చు. దీంతోపాటు తాము నివాసముంటున్న గ్రామంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా తమ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దీంతోపాటు రక్షణ నిధి కూడా ఏర్పాటు చేయడంతో ఏదైనా ఇబ్బంది కలిగినపుడు దళితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుంది.
దళిత బంధుతో ఆర్థికాభివృద్ధి
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
దళిత బంధు మంచి కార్యక్రమం
దళిత బాంధవుడు సీఎం కేసీఆర్