యాదాద్రి, ఏప్రిల్ 1 : స్వయంభు ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ఆలయం పునఃప్రారంభమైన తర్వాత మొదటి సారిగా లక్ష్మీ అమ్మవారికి అద్దాల మండ పంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకరణ చేశారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి అర్చన జరిపారు. ముత్తైదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడారు. ప్రధానాలయం వెలుపల ప్రాకారంలో అద్దాల మండపంలో ఊయలలో శయనింపు సేవ నిర్వహించారు. అర్చక బృందం స్వయంభువుకు నిత్యారాధనలు చేశారు. తెల్లవారు జామున మూడు గంటల నుంచి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ పూజలు చేశారు. హారతి నివేదనలు అర్చించారు. శ్రీవారి ఖజానాకు రూ. 11,22,493 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభువును శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ ప్రసాదాన్ని అందించారు.
యాదాద్రి, ఏప్పిల్ 1 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అనుబంధ బాల శివాలయంలో శనివారం నుంచి ఈ నెల 13 వరకు సీతారామచంద్రస్వామి నవరాత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. శివాలయ పునః నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో స్వామివారి ఉత్సవాలు బాలాలయంలోనే నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్. గీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 9వ తేదీన రాత్రి 8 గంటలకు సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు, 10న మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం, 11న మధ్యాహ్నం 12.30 గంటలకు స్వామివారి పట్టాభిషేకం, 12న మధ్యాహ్నం 12 గంటలకు సత్యనారాయణ స్వామి వత్రం, 13న నిత్యపూజలు, కంకణ విమోచన నిర్వహించనున్నారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 34,700
వీఐపీ దర్శనం 7,500
వేద ఆశీర్వచనం 600
నిత్య కైంకర్యాలు 300
సుప్రభాతం 1,800
క్యారీబ్యాగుల విక్రయం 20,000
వ్రత పూజలు 34,400
కల్యాణకట్ట టిక్కెట్లు 18,400
ప్రసాద విక్రయం 8,18,420
వాహనపూజలు 6,700
అన్నదాన విరాళం 21,333
సువర్ణ పుష్పార్చన 1,02,200
యాదరుషి నిలయం 36,300
పాతగుట్ట నుంచి 19,740
గోపూజ 100