వెంగళరావునగర్ : హైదరాబాద్,వరంగల్లో ఎయిడ్స్ రోగుల కోసం ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయను న్నట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. బుధవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డ ఛాతీ దవాఖానాలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఎయిడ్స్ అవగాహన ర్యాలీని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం దవాఖానా ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రంలో 167 ఐసీటీసీ కేంద్రాలను నెలకొల్పడం జరిగిందని.. 22 ప్రభుత్వ ఏఆర్టీ చికిత్స కేంద్రాల్లో ఎయిడ్స్ రోగులకు వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.
రూ.50 కోట్లను ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిపట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో 90శాతం మరణాల సంఖ్య తగ్గిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎయిడ్స్ 0.7 శాతంగా ఉండేదని.. క్రమేణా ఇప్పుడు 0.4 శాతానికి తగ్గించగలిగామని.. ఇదంతా ప్రజల్లో వచ్చిన చైతన్యంతో సాధ్యమైందని అన్నారు.
హెచ్.ఐ.వీ. రోగులకు ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు.. మానవత్వంతో ఆదుకోవడానికి 32 వేల మంది ఎయిడ్స్ రోగులకు రూ.2016 చొప్పున ఆసరా పెన్షన్లను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. హైరిస్కుతో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుందని..ఎయిడ్స్ నియంత్రణ కోసం జరిగే పోరాటంలో స్వచ్చందసంస్థల పాత్ర కీలకమైందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఎయిడ్స్, షుగర్ వ్యాధిగ్రస్తులకు త్వరలోనే హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలంతా కలిసి ఎయిడ్స్ మహమ్మారిని తరిమివేయాలని, బాధితులను కాపాడుకోవాలని అన్నారు.
చెస్ట్ ఆసుపత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసే 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు.. హైదరాబాద్ నలువైపులా నిర్మించే మొత్తం 4 ఆసుపత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నారని ఆయన వెల్లడించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని చెప్పారు.
సమావేశం అనంతరం దవాఖానాలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించే ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. టీబీ వార్డుల్లోని రోగులను పరామర్శించి.. అక్కడ వైద్యం, ఆహారం, వసతులను అందిస్తున్న తీరును అడిగి తెల్సుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంయిడ్స్ నియంత్రణా విభాగం డైరెక్టర్ ప్రీతి నీనా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్రెడ్డి, ఛాతీ దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ఖాన్, మానసిక దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ తదితరులతో పాటు దవాఖానా వైద్య నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎయిడ్స్ అవాగాహన ర్యాలీలో పాల్గొన్నారు.