ఖైరతాబాద్ : చిన్నపత్రికలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.
చిన్నపత్రికలకు ప్రకటనల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.10కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ టీయూడబ్ల్యూజే (143) అనుబంధ తెలంగాణ ఎంపానెల్డ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘చిన్న, మధ్యతరహా పత్రికల సంపాదకుల కృతజ్ఞత సభ’ శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ బిజిగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
యాడ్స్కు నిధులు కేటాయిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి టీయూడబ్ల్యూజే (143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారూతీసాగర్, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యోగానంద్, నవీన్ కుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి అవ్వారి భాస్కర్తో కలిసి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ చిన్న పత్రికలకు అడ్వర్టయిజ్ మెంట్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు. ఈ ప్రక్రియ కోసం మారూతి సాగర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్లు పలు పర్యాయాలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు.
ఎంపానెల్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ అని, వారితో పాటు అడ్హక్ ప్రాతిపదికన ఉన్న వారికి కూడా అక్రిడిటేషన్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అని అన్నారు. మారూతిసాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 309 డైలీ, 250 మ్యాగజైన్లు ఉన్నాయని, సుమారు 6వేల మంది జర్నలిస్టులు వాటిపై ఆదారపడి జీవిస్తున్నారన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. హెల్త్కార్డులు సైతం అందించారని, త్వరలోనే ప్రతి జర్నలిస్టుకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇండ్ల నిర్మాణాలు, స్థలాల కేటాయింపులు జరిగాయన్నారు.
ప్రస్తుతం చిన్న, మధ్యతరహా పత్రికలకు యాడ్స్ కోసం రూ.10కోట్ల బడ్జెట్ కేటాయించి జర్నలిస్టుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని నిరూపించుకుందన్నారు. ఈ సభలో తెలంగాణ ఎలక్టానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (టెమ్జు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, తెలంగాణ ఎంపానెల్డ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కో కన్వీనర్ సిరికొండ అగస్టిన్, సీనియర్ జర్నలిస్టులు జానకీరామ్, కేసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.