ఖైరతాబాద్ : మూగజీవాల ఆకలితీర్చేందుకు అనేక సంస్థలు స్వచ్ఛంధంగా ముందుకు వస్తున్నాయి. వాటి బాగోగులు చూసుకునేందుకు తగిన ఆర్థిక సాయం అందిస్తున్నాయి. అదే కోవలో దివంగత సీఎల్పీ నేత పి. జనార్ధన్ రెడ్డి జ్ఞాపకార్ధం ఆయన కుమార్తె, ప్రస్తుత ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయా రెడ్డి పీజేఆర్ ఫౌండేషన్ను స్థాపించ అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ప్రతి ఏడాది పీజేఆర్ జయంతి, వర్ధంతి సందర్భంగా రక్తదాన, ఆరోగ్య, కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ ఏడాది పీజేఆర్ 14వ వర్థంతి సందర్భంగా విజయా రెడ్డితో పాటు ఆమె సోదరి పావని రెడ్డిలు నగర జూపార్క్లో ఉన్న అరుదైన మృగరాజు ఏషియాటిక్ లయన్ను దత్తత తీసుకోవాలని సంకల్పించారు.
ఆ మేరకు సోమవారం జూ క్యూరేటర్కు రూ.1లక్ష విలువైన చెక్కును, ఒప్పంద పత్రాన్ని అందజేశారు. ఒప్పందం ప్రకారం….వచ్చే ఏడాది మార్చి 1నుంచి నవంబర్ 30 వరకు ఏషియాటిక్ లయన్ పోషణా బాధ్యత పీజేఆర్ ఫౌండేషన్కు ఉంటుంది. తన తండ్రి వర్థంతి సందర్భంగా మూగ జీవానికి సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని విజయా రెడ్డి స్పష్టం చేశారు.