రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం అందరికీ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేసి విద్యా తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నది. అందులో భాగంగా ఈ నెల 11నుంచి 25వ తేదీ వరకు బడి బయట పిల్లల సర్వే చేపడుతున్నది. తద్వారా బడి బయట పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్చి వందశాతం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నది.
అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం, విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ‘అందరూ చదవాలి- అందరూ ఎదగాలి’నినాదంతో ముందుకు సాగుతున్నది. బ పాఠశాలకు వెళ్లకుండా ఉన్నడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించే ఉద్దేశంతో సర్వే చేపడుతున్నది. ఇందుకు జిల్లాలోని ఎంఈఓ, డీఎల్ఎంటీ, సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్లకు సర్వేపై అవగాహన కల్పించారు. అందుకు తయారుచేసిన ప్రణాళిక మేరకు ‘బడి బయట ఉన్న పిల్లల’వివరాలు గుర్తించి ఆ ఆన్లైన్లో(చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్) నమోదు దిశగా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
71 మండలాల్లో పక్కాగా సర్వే
అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో బడి బయట ఉన్న 6నుంచి 14ఏండ్లు, 15నుంచి 19ఏండ్ల పిల్లలను గుర్తించేందుకే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 71 (నల్లగొండ 31, సూర్యాపేట 23, యాదాద్రి 17)మండలాల ఎంఈఓలు, క్లాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్స్పీలు, డీఎల్ఎంటీలు, ఐఈఆర్టీలకు విద్యాశాఖ సమగ్ర శిక్షణతో ఇప్పటికే అవగాహన కల్పించింది. సర్వేలో ఏ వివరాలు సేకరించాలనే అంశంపై సలహాలు, సూచనలు అందించారు. సర్వేలో ఆయా పాఠశాలల పరిధిలోని అంగన్వాడీ టీచర్ల సహాయం తీసుకోనున్నారు. దీంతో ఈ నెల 11నుంచి 25వరకు సర్వే చేసి గుర్తించిన బడి బయటి పిల్లల వివరాలను ఎంఆర్సీకి అక్కడి నుంచి డీఈఓ కార్యాలయానికి పంపించనున్నారు.
సర్వే ఇలా…
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 251మంది సీఆర్పీలు సర్వేలో నిమగ్నమయ్యారు. (వీరిలో నల్లగొండ 113, సూర్యాపేట 79, యాదాద్రి 59) ఉన్నారు. సర్వేలో తల్లిదండ్రుల పని, పిల్లలు బడికి వెళ్లకపోవడానికి గల కారణాలు, ఎంతవరకు చదివి మానేశారు అనే అంశాలు చూస్తారు. అదే విధంగా సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉంటే నిర్ధారణ చేయాల్సి ఉంది. ఆర్థిక స్థోమత సరిగా లేకపోవడంతో జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పిల్లలు చదువు మధ్యలోనే మానేస్తున్నారు. దీంతో చిన్నారులు సైతం తల్లిదండ్రులు పనిచేసే చోటే ఉంటూ బడికి దూరమవతున్నారు. వీరి వివరాలు సేకరించి బడిలో చేర్పించే అవకాశముంది.
14అంశాలతో కూడిన ప్రొఫార్మాతో ….
సర్వేకు సంబంధించి 14అంశాల సమాచారంతో కూడిన ప్రొఫార్మాతో సీఆర్పీలు క్లాంప్లెక్స్ (క్లస్టర్)వారీగా సర్వేలో నిమగ్నమయ్యారు. సీఆర్ప్పీలు ప్రొఫార్మాలోని అంశాలపై అవగాహన పెంచుకుని వారి కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల పరిధిలో సర్వే పూర్తి చేయాల్సి ఉంది. విద్యార్థి బడికి వస్తూ మానేస్తే ఆ విద్యార్థి అంశాలను నమోదు చేయాలి. 25లోగా సర్వే పూర్తి చేసి ఈ వివరాలను మండల వనరుల కేంద్రాలతో జిల్లా విద్యాశాఖకు చేరవేయాల్సి ఉంది.
గతేడాది గుర్తించిన విద్యార్థులు
నల్లగొండ జిల్లాలో బడి బయట పిల్లల సర్వేలో అధికారులు 287మంది విద్యార్థులను గుర్తించారు. వీరిలో 77మందిని బడుల్లో చేర్పించగా 202మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఇతర రాష్ర్టాలకు వెళ్లారు.సూర్యాపేట జిల్లాలో 204మందిని గుర్తించారు. వీరిలో 104మందిని బడుల్లో చేర్పించగా 100మంది విద్యార్థులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ర్టాలకు తల్లిదండ్రులతో తరలివెళ్లారు.యాదాద్రిభువనగిరి జిల్లాలో 106మంది విద్యార్థులను గుర్తించారు. వీరిలో 72మందిని బడిలో చేర్పించగా 34మంది వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు.
జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా సర్వే
నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఈ నెల 11నుంచి బడి బయటి పిల్లల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నాం. ఇతర ప్రాంతాలు, రాష్ర్టాల నుంచి పనుల కోసం జిల్లాకు వలస వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపనట్లు సర్వేలో గతేడాది తేలింది. గతేడాది గుర్తించిన వారిలో 77మందిని బడిలో చేర్పించగా 202మందిని వివిధ రాష్ర్టాలకు తల్లిదండ్రులతో పాటు తిరిగి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా నేటి వరకు సర్వేలో 83మంది విద్యార్థులను గుర్తించారు. సర్వే పూర్తి కాగానే గుర్తించిన పిల్లలందరినీ బడిలో చేర్పించి విద్య అందిస్తాం.