నిజాంసాగర్, జనవరి14: మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. శుక్రవారం జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా, వాటిని రద్దు చేసిందన్నారు. ప్రస్తుతం ఎరువుల ధరలను 50 నుంచి వంద శాతం వరకు పెంచి రైతుల నడ్డి విరిచి, కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తోందని ఆరోపించారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వారి కడుపు కొడుతున్నదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ ప్రకటనలు చేసి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం నేడు వారి కడుపులో మంట పెడుతున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతును రాజుచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీజేపీకి లేదన్నారు. వృథా జలాలను సద్వినియోగం చేసుకుంటే దేశంలోని ప్రతి రైతుకు సాగు నీరు అందుతుందనే ధ్యాస మోదీకి లేదన్నారు. కుల మతాలను అడ్డుపెట్టుకొని ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఇక ఇలాంటి ఆటలు సాగవన్నారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు టీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు మాధవ్రావ్దేశాయ్, నీలు పటేల్ పాల్గొన్నారు.