సూర్యాపేట టౌన్, జనవరి 27 : కరోనా కట్టడి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నాయి. జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు సహా కొవిడ్ లక్షణాలున్న వారికి మందులు అందించి భరోసా కల్పిస్తున్నాయి. 7 రోజులుగా ఇంటింటికీ వెళ్తున్న వైద్యారోగ్య శాఖ సిబ్బంది.. 1,87,055 నివాసాలను లెక్కించి 7,99,597 మంది ఆరోగ్య వివరాలు సేకరించారు. కొవిడ్ అనుమానిత లక్షణాలున్న 3,010మందికి మెడికల్ కిట్లు అందించారు. సర్వే శుక్రవారంతో ముగియనున్నందున ప్రజలంతా సిబ్బందికి సహకరించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం పేర్కొన్నారు.