హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు సత్ఫలితాలు ఇస్తుండడంతో మారుమూల గ్రామాల్లోనూ ప్రభుత్వం దశలవారీగా పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హెల్త్ సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చుతూ అవసరమైన సిబ్బందిని నియమిస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 18 చొప్పున మొత్తం 54 సబ్సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చింది. తాజాగా మరో 188 సబ్ సెంటర్లకు వైద్యులను నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పైసా ఖర్చు లేకుండా సొంతూర్లలోనే వైద్య పరీక్షలు చేయడం, డాక్టర్లు వచ్చి వైద్య సేవలు అందిస్తూ మందులు ఇస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలపై దృష్టి సారించి ప్రాధాన్యతా క్రమంలో చక్కదిద్దుతున్నారు. అభివృద్ధికి సూచికలుగా నిలిచే విద్య, వైద్యం, వ్యవసాయానికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో సేద్యం పెరుగగా, ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా కేజీ టు పీజీ ఉచిత విద్య కోసం గురుకులాలు ఏర్పాటు చేశారు. వైద్యం విషయంలోనూ ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు.
ఈ నేపథ్యంలో నేడు దాదాపుగా 70 శాతం మంది పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ దవాఖానకే వెళ్తున్నారు. మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పాటు ఏరియా దవాఖానలు, పీహెచ్సీలు, ఆర్బన్ హెల్త్ సెంటర్ల ఆధునీకరణ, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టడంతో ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ప్రైవేటుకు దీటుగా 90శాతానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్లు అందించడంతో పాటు అమ్మ ఒడి పథకం ద్వారా పదివేలకు పైగా అందుతున్నాయి. దాంతో ప్రజలు ప్రభుత్వ వైద్యం వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తుంది.
పల్లెలకు డాక్టర్లు… పేదలకు మెరుగైన వైద్య సేవలు…
హైదరాబాద్లో బస్తీ దవాఖానాలతో వైద్య సేవలు చేరువకాగా, అదే క్రమంలో జిల్లాల్లోనూ పల్లె దవాఖానలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్లతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నది. ఓపీ సేవలు, సీజనల్ జ్వరాలు, బీపీ, షుగర్, మాతా శిశు సంరక్షణ, ఇమ్యునైజేషన్తో పాటు ఇతర పరీక్షలు, చికిత్సలు చేస్తూ అవసరమైన మందులు ఇస్తున్నారు. అంతే కాకుండా మెరుగైన వైద్యం అవసరమున్న వారిని ఏరియా ఆసుపత్రులు, జనరల్ దవాఖానలతో పాటు హైదరాబాద్లోని ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు.
ఇప్పటికే 54.. కొత్తగా 188 పల్లె దవాఖానలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 54 హెల్త్ సబ్ సెంటర్లలో ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్లను నియమించి పల్లె దవాఖానలుగా మార్చగా తాజాగా మరో 188 ప్రాంతాల్లో వైద్యులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సూర్యాపేట జిల్లాలో 169, నల్లగొండలో 257, యాదాద్రి 138 సబ్ సెంటర్లు మొత్తం కలిపి 567 సబ్ సెంటర్లు ఉండగా వాటన్నింటినీ దశలవారీగా పల్లె దవాఖానలుగా మార్చనున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో 18 చొప్పున మొత్తం 54 పల్లె దవాఖానలుగా మార్చి ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్లను నియమించారు. అయితే మరో 188 గ్రామాల్లోని సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చడంతో పాటు వైద్య సిబ్బంది నియామకానికి గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జీఓ జారీ చేసింది.
ప్రజలపై తగ్గుతున్న ఆర్థిక భారం..
పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గిపోయింది. సాధారణంగా గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ప్రైవేట్ డాక్టర్లను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఫీజులు, పరీక్షలు, అదే స్థాయిలో మందులు ఇలా.. దాదాపు వేలల్లో ఖర్చవుతుంది. అయితే, పల్లె దవాఖానల ద్వారా ఎలాంటి ఫీజు లేకుండా వైద్యులు పరీక్షించి ఉచితంగానే మందులు కూడా అందిస్తుండడంతో పేదలపై ఆర్థిక భారం తగ్గిపోయింది.
ప్రతి రోజూ 50 నుంచి 70 మంది ఓపీ
పల్లె దవాఖానల్లో నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి సెంటర్లోనూ నిత్యం దాదాపు 50 నుంచి 70 మందికి పరీక్షలు చేసి అవసరమున్న వారికి ఉచితంగా మందులు అందిస్తున్నారు. సొంత గ్రామాల్లోనే వైద్య పరీక్షలు చేస్తుండడంపై ప్రజలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు వెనువెంటనే చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు.
డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, సూర్యాపేట జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్
ప్రైవేట్ దవాఖానకు పోతలేం..
ఇంతకు ముందు జ్వరం వచ్చినా, జబ్బు చేసినా సూర్యాపేటకు పోయి ప్రైవేటు దవాఖానలో చూపించుకునేవాళ్లం. ఆటో కిరాయి మొదలుపెట్టుకుంటే ఫీజులు, పరీక్షలు, మందులకు చాలా ఖర్చయ్యేది. జబ్బు తొందరగా నయంగాక పైసలు మస్తు ఖర్చయితుండె. కానీ, ఇప్పుడు పెద్ద డాక్టరు మా ఊరికే వచ్చి పరీక్షలు చేస్తున్నరు. ఫ్రీగా మందులు ఇస్తున్నరు.
తాడూరి సునీత, బాలెంల