ఎండిపోయిన పల్లెప్రకృతి వనం, హరితహారం మొక్కలు
పునాదులకే పరిమితమైన వైకుంఠధామం
అధికారుల నిర్లక్ష్యంతో పడకేసిన పారిశుధ్యం.. ఇబ్బందుల్లో గ్రామస్తులు
వలిగొండ, ఏప్రిల్ 4 :పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగా పల్లెప్రగతి పేరుతో ప్రత్యేక నిధులు కేటాయించింది. అయితే అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో వలిగొండ మండలంలోని వెల్వర్తి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామంలోని వీధుల వెంట చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. చెత్తను డంపింగ్ యార్డ్డుకు తరలించడానికి ప్రభుత్వం ఇచ్చిన ట్రై సైకిళ్లు, ట్రాక్టర్ నిరుపయోగంగా మారాయి. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, డంపింగ్ యార్డు నిర్మాణాల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
‘అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఉన్నది వలిగొండ మండల పంచాయతీ అధికారుల తీరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం పల్లె ప్రగతి పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రత్యేక నిధులు కేటాయించింది. మండలంలోని అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందుతుంటే మండలంలోని వెల్వర్తి గ్రామం మాత్రం అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోక ప్రజలు అపరిశుభ్ర వాతావరణం మధ్య తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ పాలక సభ్యులు, పంచాయతీ అధికారులకు మధ్య ఉన్న సమన్వయ లోపంతో ప్రభుత్వ ఆశయం నెరవేరకుండా పోతున్నది. గ్రామంలోని వీధుల వెంట చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు యథేచ్ఛగా దర్శనం ఇస్తున్నాయి. చెత్తను డంపింగ్ యార్డ్కు తరలించడానికి ప్రభుత్వం ఇచ్చిన ట్రై సైకిళ్లు, ట్రాక్టర్ నిరుపయోగంగా ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యపు సమాధానం ఇలా ..
ప్రభుత్వ పథకాల పనుల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యం గ్రామాభివృద్ధిలో కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. వెల్వర్తిలో పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై, వైకుంఠధామం నిర్మాణ పనులపై, పల్లె ప్రకృతి వనం, రైతువేదిక నిర్మాణం, డంపింగ్ యార్డ్ నిర్మాణ పనుల నత్తనడకపై ఎంపీడీవో గీతారెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా, ఎంపీవో కేదారీశ్వర్ సమాచారం ఇస్తారని తెలిపారు. ఎంపీవో కేదారీశ్వర్ను వివరణ కోరగా, పంచాయతీ కార్యదర్శిని అడగమని, పంచాయతీ కార్యదర్శి ప్రసన్నను సంప్రదించగా, వెల్వర్తి గ్రామ కార్యదర్శిగా విధుల్లో చేరి నెల రోజులు మాత్రమే అవుతుందని, తన కన్న ముందు పని చేసిన పంచాయతీ కార్యదర్శి తుమ్మల ఆనంద్కే అన్ని వివరాలు తెలుసని, ఇప్పటి వరకు పంచాయతీ రికార్డులుగాని, చార్జీ అప్పగించలేదని, పూర్తి వివరాల కోసం ఆనంద్ను కనుక్కోమని చెప్పి ఎవరికి వారు తప్పించుకున్నారు. ఈ విషయంపై ఆనంద్ను వివరణ కోరగా ప్రస్తుతం వెల్వర్తి పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో లేనని తెలిపాడు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువై ఫలవంతం కావాలంటే అధికారులు నిబద్ధతతో పని చేసినప్పుడే సాధ్యం అవుతుందని ప్రజలు చెబుతున్నారు.
నీళ్లులేక ఎండిపోతున్న మొక్కలు
ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి కాలుష్యం నుంచి ప్రజలను రక్షించాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. అయితే, వెల్వర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కలు మాత్రం నీళ్లులేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం వేలాది రూపాయలను ఖర్చు చేసి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతున్నది. హరితహారంలో నాటిన ప్రతి మొక్క పరిరక్షణకు, పల్లె ప్రకృతి వనంలోని మొక్కలకు నీరందించడానికి, ప్రభుత్వం అందించిన వాటర్ ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీళ్లు పోయకుండా ఏం అవసరానికి ఉపయోగిస్తారో పంచాయతీ సభ్యులు, అధికారులు సమాధానం చెప్పాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల అలసత్వంతోనే అవినీతి
‘పల్లెప్రగతి’లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవినీతి చోటుచేసుకున్నది. నాణ్య తా ప్రమాణాలు పాటించలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనే జీ పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా పాత డ్రైనేజీలో డ్రైనేజీ పైపులు వేసి బిల్లులు డ్రా చేశారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనులకు.. చూపిన లెక్కలకు పొంతనలేదు. గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండా, వార్డు సభ్యులతో సంప్రదించకుండా సర్పంచ్, పంచాయతీ అధికారులు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనం పూర్తి కాకుండా బర్రెల దొడ్డిగా మారింది.