మణికొండ : విధి నిర్వాహణలో నిర్లక్ష్యం, ప్రజలతో మాట్లాడే వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మణికొండ మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగ ఏఈ విఠోబాను ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేస్తూ మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీచేసినట్లు కమీషనర్ జయంత్ తెలిపారు. గత కొన్నిరోజులుగా మున్సిపల్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న విఠోబా అక్రమ వసూళ్లు, కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రజలతో మాట్లాడే వ్యవహారంలో నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అనేక వివాదాల్లో తలదూర్చడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించి ఆయనను ప్రధాన కార్యాలయానికి సరెండర్చేశారు.
పలు కాలనీలల్లో రహదారుల నిర్మాణ విషయంలో నిధుల మళ్లింపుల్లోనూ వివాదాలను ఎదుర్కొంటున్న విఠోబాను తొలగించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మున్సిపాలిటీలో అన్నీ వివాదాలే కొనసాగుతుండటం గమనార్హం. ఇప్పటికే మున్సిపాలిటీ మేనేజర్గా కొనసాగిన పవన్కుమార్, టౌన్ప్లానింగ్ అధికారి కల్యాణ్ చక్రవర్తిలను ఉన్నతాధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. మరో అధికారిని సైతం సరెండర్ చేయడంతో ప్రస్తుతం కార్యాలయంలో టీపీఎస్, కమీషనర్ మాత్రమే మిగిలారు. సిబ్బంది లేక ఇప్పటికే ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థానిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని సిబ్బందిని భర్తీచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.