లింగంపేట, జనవరి 16: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో మండలంలోని పర్మళ్ల, సురాయిపల్లి, లింగంపల్లి, ఐలాపూర్, రాంపల్లి, శెట్పల్లి సంగారెడ్డి గ్రామాల్లో జొన్న, గోధుమ, మినుము పంటలను సాగు చేయగా మోతె, లింగంపల్లి, బూరుగిద్ద, బోనాల్ గ్రామాల్లో చెరుకు పంటను పండిస్తున్నారు. యాసంగిలో సాగు చేస్తున్న పంటల రక్షణ కోసం సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వరి సాగుకు అయ్యే ఖర్చు, వచ్చే ఆదాయాన్ని ఇతర పంటలకు అయ్యే వ్యయంతో బేరీజు వేసుకొని రైతులు ఆరుతడి వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను సాగు చేస్తున్నారు. గోధుమలు, జొన్నలతోపాటు పప్పుదినుసులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతుకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వాణిజ్య పంట అయిన చెరుకు సాగువైపు రైతులు దృష్టి సారించారు.