ముషీరాబాద్ : హుస్సేన్ సాగర్ నాలా విస్తరణలో పేదలు ఇళ్లు కోల్పోకుండా చూస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సాగర్ పరివాహక బస్తీల ప్రజలకు హామీ ఇచ్చారు. నాలా ప్రహారీని ఆక్రమించకుండా నిర్మించుకున్న ఇళ్లకు ఎటువంటి ప్రమాదం ఉండబోదని స్పష్టం చేశారు.
మంగళవారం ఆయన హుస్సేన్ సాగర్ నాలా పరివాహక బస్తీల్లో పర్యటించి స్థానికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు పేదరికంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను సాగర్ నాలా విస్తరణ పేరిట తొలగించడానికి అధికారులు మార్కింగ్ చేశారని, తమ ఇళ్లకు నష్టం వాటిళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.
ఇందుకు స్పందించిన ఆయన ఇప్పటికే నాలా ప్రహారీ నిర్మాణం, ప్రభావితమవుతున్న ఇళ్ల అంశాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు నాలాకు ఇరువైపులా ఉన్న బస్తీలు ముంపుకు గురికావద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నాలా విస్తరణ, ప్రహారీ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించిందన్నారు.
గతంలో నాలా ప్రహారీ నిర్మించిన చోట వరద సమస్య తలెత్తడం లేదని, అటువంటి చోట విస్తరణ సమస్యే ఉండబోదని స్పష్టం చేశారు. నాలాపైన కాకుండా వెనక్కి జరిగిన చేపట్టిన నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించబోమన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్తో చర్చించామని, గతంలో కట్టిన ప్రహారీలను పటిష్టం చేయాలని కోరినట్లు తెలిపారు.
కొంతమంది చేస్తున్న రాజకీయ, అసత్యపు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. నాలా పరివాహక బస్తీలైన సబర్మతీనగర్, మారుతీనగర్, డిఎస్ నగర్లలో ఎవరి ఇళ్లు కూల్చకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ భోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, నాయకులు బింగి నవీన్, ఆర్, శ్రీనివాస్, శంకర్గౌడ్, శ్యామ్ యాదవ్, మక్బుల్, సాయి, షరీఫ్, డిఎస్నగర్ బస్తీ అధ్యక్షుడు నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.