సంక్రాంతి పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాకిళ్లన్నీ రంగురంగుల ముత్యాల ముగ్గులు, ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. హరిదాసులు, గంగిరెద్దుల వారు ఇంటింటికీ తిరుగుతూ సందడి చేశారు.
శివ్వంపేట, జనవరి 16: ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మం డల వ్యాప్తంగా సంక్రాంతి సంబురాలను అంబరాన్నంటాయి. మండలంలోని గూడూరు గ్రామంలో సర్పంచ్ స్వరాజ్యలక్ష్మీశ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాల్లో భాగంగా రైతులకు పోటీలు, సంక్రాంతి పండగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. యువకులకు గన్నీబ్యాగ్ రన్నింగ్ పోటీలు, చిన్నారులకు ఒంటికాలు పోటీలు, యువ రైతులకు కుర్చీలాట నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామంలో పోటీలు నిర్వహించి అందరినీ పాల్గొనే విధంగా ప్రోత్సహించిన సర్పంచ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిని అభినందించారు. సీఎం కేసీఆర్ ప్రతీ పండుగకు ప్రాధాన్యతను ఇస్తున్నారని గుర్తుచేశారు. ఇటీవలనే రైతుబంధు వేయగా రైతులందరూ చాలా సంతోషంతో సంబురాలు నిర్వహించారని గుర్తుచేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచిన బందెల పద్మకు, ఇతర పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అంతకుముందు నిర్వహించిన కోడిపందాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు లావణ్యమాధవరెడ్డి, సర్పంచ్లు స్వరాజ్యలక్ష్మిశ్రీనివాస్గౌడ్, చంద్రకళ శ్రీశైలంయాదవ్, బాలమణినరేందర్, ఎంపీటీసీలు నువ్వుల దశరథ, గోవింద్నాయక్, రైతువిభాగం అధ్యక్షుడు మైసయ్యయాదవ్, నాయకులు రాజ్యం భిక్షపతి, బేగరి నర్సయ్య, భీమనపల్లి మురళీ, యాదయ్య, వంజరి కొండల్, పీఈటీ భీమనపల్లి రమేశ్, సందీప్, గ్రామస్తులు పాల్గొన్నారు.