ప్రాణాలు హరిస్తున్న నాందేడ్-అకోలా రహదారి
సంగారెడ్డి జిల్లాలో చౌటకూరు-శివ్వంపేట బ్రిడ్జి వరకు జరపైలం
ఏడాదిలో లెక్కలేనన్ని ప్రమాదాలు.. 50కి పైగా మరణాలు
మలుపుల వద్ద బోల్తా పడుతున్న వాహనాలు
నిబంధనలు, స్వీయ నియంత్రణ పాటిస్తేనే మేలు
నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణంతో తగ్గనున్న ప్రమాదాలు
సంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్తున్న నాందేడ్-అకోలా జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారింది. చౌటకూరు-శివ్వంపేట బ్రిడ్జి వరకు ఉన్న పది కిలోమీటర్ల రహదారి ప్రాణాలను హరిస్తున్నది. ఈ దారి అనేక మందిని బలి తీసుకోగా, ఎంతోమందిని క్షతగాత్రులుగా మార్చింది. వారి కుటుంబాలను రోడ్డు పాల్జేసింది. జోగిపేట నుంచి సంగారెడ్డి- హైదరాబాద్ వెళ్లేందుకు ఈ దారే ప్రధానమైంది. ఈ రోడ్డుపై ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేశామంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అదే తేలింది. ఏడాది కాలంలో ఈ రోడ్డుపై చౌటకూర్-శివంపేట్ బ్రిడ్జి మధ్య లెక్కలేనన్ని ప్రమాదాలు జరిగాయి. 50మంది వరకు మృత్యుఒడి చేరగా, ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. దీంతో ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు ‘అమ్మో.. నాందేడ్-అకోలా రహదారా’..! అంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం పూర్తయితే, ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. నిబంధనలు, స్వీయ నియంత్రణ పాటిస్తేనే మేలని పోలీసు శాఖ సూచిస్తున్నది.
ప్రాణాలు హరిస్తున్న నాందేడ్-అకోలా రహదారి
సంగారెడ్డి జిల్లాలో చౌటకూరు-శివ్వంపేట బ్రిడ్జి వరకు జరపైలం లెక్కలేని ప్రమాదాలు.. 50కి పైగా మరణాలువద్ద బోల్తా పడుతున్న వాహనాలు స్వీయ నియంత్రణ పాటిస్తేనే మేలు లేన్ల రోడ్డు నిర్మాణంతో తగ్గనున్న ప్రమాదాలు
అందోల్, ఆగస్టు 11 : సంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్తున్న నాందేడ్-అకోలా జాతీయ రహదారి తరుచూ ప్రమాదాలతో మృత్యుదారిగా మారుతున్నది. 161 జాతీయ రహదారి సంగారెడ్డి జిల్లా శివ్వంపేటలో మొదలై, జోగిపేట మీదుగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట వరకు ఉంటుంది. అయితే, జోగిపేట నుంచి సంగారెడ్డి- హైదరాబాద్ వెళ్లేందుకు ఇది ప్రధాన మార్గం. నిత్యం ఈ దారిగుండా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మితిమీరినా వేగమో.. లేదా గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే తొందరో తెలియదు గానీ, అనుకోని ప్రమాదాల్లో ఎందరో మృత్యువాత పడుతుండగా, వారి కుటుంబాలు దిక్కులేనివారవుతున్నారు. ఏడాది కాలంలో ఈ రోడ్డుపై చౌటకూర్-శివ్వంపేట్ గ్రామాల మధ్య లెక్కలేనన్ని ప్రమాదాలు జరిగి 50 మంది వరకు మృత్యువాతపడగా, ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. దీంతో ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు అమ్మో.. నాందేడ్-ఆకోలా రహదారా అంటూ ఆందోళన చెందుతున్నారు.
నిత్యం రద్దీ..
ఈ రోడ్డు గుండా నిత్యం నాందేడ్-ఆకోలా, ఢిల్లీ తదితర ప్రాంతాలకు పెద్దపెద్ద వాహనాలు, సరుకుల కంటైనర్లు వెళ్తుంటాయి. అంతేకాకుండా సంగారెడ్డి, జోగిపేట, మెదక్, నారాయణఖేడ్ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగస్తులు, వ్యాపారులు నియోజకవర్గంలో జేఎన్టీయూ, పాలిటెక్నిక్తోపాటు మరెన్నో ఉన్నత విద్యాసంస్థలు ఉండడంతో విద్యార్థులు ఈ మార్గంలోనే పెద్ద సంఖ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ప్రతీరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ రహదారి వాహనాల రాకపోకలతో రద్దీగా దర్శనమిస్తుంది.
ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేస్తే అంతే..
ఈ రోడ్డుపై ముందు వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేశామంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో చాలా మట్టుకు ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేయబోతున్న సమయంలో జరిగినవేనని స్పష్టంగా తెలుస్తోంది. గత మార్చిలో అల్మాయిపేట్ (బసనాగు) వద్ద ఆటో-కంటైనర్ ఢీకొని నలుగురు మృతి చెందగా, భర్తతోపాటు కొడుకును పొగొట్టుకుని ఓ తల్లికి తీరని దుఃఖాన్ని మిగల్చగా మరొక ఇంటికి పెద్దను దూరం చేసింది. ఏడాదిలో ఇప్పటివరకు ఇలా ఇంటి పెద్దలు, ఆత్మీయులను కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదం సైతం ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతున్న సమయంలో జరిగిందే. ఈ ప్రమాదంలో కూడా ఐదుగురు మృతి చెందగా, వారిపైనే ఆధారపడిన ఐదుగురు పిల్లలు అనాథలయ్యారు. సీట్బెల్టు ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించి నిధానంగా ప్రయాణం చేస్తే ఈ ప్రమాదం జరిగుండేది కాదని ప్రమాద స్థలంలో స్థానికులు చర్చించుకున్నారు.
ఆ పది కిలోమీటర్లలోనే ఎక్కువగా..
ఈ రోడ్డుపై ముఖ్యంగా అల్మాయిపేట్(బసనాగు) నుంచి శివ్వంపేట బ్రిడ్జి వరకు పది కిలోమీటర్లలో తరుచూ ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. చౌటకూర్ క్రాసింగ్, ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న మలుపు, ఎంపీ డిస్టిలరీ(బీరు ఫ్యాక్టరీ) సుల్తాన్పూర్ క్రాసింగ్, శివ్వంపేట్ క్రాసింగ్, శివ్వంపేట్ బ్రిడ్జి వద్ద ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎంతో మంది మృత్యువాతపడుతున్నారు. చౌటకూర్ శివారుల్లో రెండు చోట్ల ప్రమాదకరమైన మలుపులున్నాయి. దీంతో ఈ రోడ్డుపై కొత్తగా వచ్చే వాహనాల వారికి మలుపుల విషయంపై సరైన అవగాహనలేక స్పీడ్గా వస్తుండడంతో ఇక్కడ వాహనాలు బోల్తాపడుతున్నాయి.
నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణంతో
తగ్గనున్న ప్రమాదాలు
రోడ్డు చిన్నగా ఉండడం.. వాహనాల రాకపోకలు పెద్ద సంఖ్యలో ఉండడం కూడా తరుచూ ప్రమాదాలకు ఓ కారణంగా చెప్పాలి. ఇప్పుడూ ఈ రోడ్డు విస్తరణలో భాగంగా నాలుగు లేన్లుగా ఏర్పడనుండడంతో ప్రమాదాలు తగ్గనున్నాయి. సంగుపేట-నుంచి శివ్వంపేట వరకు నాలుగులెన్ల రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో మరికొన్ని రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తయి, ప్రయాణాలు సాఫీగా సాగనున్నాయి.
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
జోగిపేట-సంగారెడ్డి ప్రధాన రహదారిపై ప్రమాదాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చౌటకూర్లో పోలీస్స్టేషన్ ఏర్పాటు చేసి, జేఎన్టీయూ దగ్గర ఔట్పోస్టు ఏర్పాటు చేస్తాం. చౌటకూర్లో పోలీసుస్టేషన్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేయాలని జిల్లా అధికారులు చెప్పాం. రెవెన్యూ అధికారులతో మాట్లాడి పైఅధికారులకు నివేదిక ఇచ్చాం. పోలీస్స్టేషన్, ఔట్ పోస్టు ఏర్పడితే జోగిపేట-సంగారెడ్డి వరకు రోడ్డుపై వెళ్లే వాహనాల కదలికలపై దృష్టి ప్టెచ్చు. అంతే కాకుండా ప్రతీ రోజు రహదారులపై వాహనాల తనిఖీ చేపట్టి ట్రాఫిక్రూల్స్పై అవగాహన కల్పిస్తున్నాం. బైక్లు నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్బెల్టు పెట్టుకుని స్వీయ నియంత్రణతో డ్రైవింగ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగవు.