తెలుగుయూనివర్సిటీ : ప్రముఖ నాటకరంగసంస్థ రసరంజని నిర్వహణలోప్రఖ్యాత రంగస్థల నిపుణులు గరిమెళ్ళ రామమూర్తి 85వ జయంతి, ప్రముఖ నాట్యాచార్యులు చాట్ల శ్రీరాములు 90వ జయంతిని ఆబిడ్స్ తిలక్రోడ్డులో గల తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
గరిమెళ్ళ రామమూర్తి పేరిట నెలకొల్పిన రంగస్థల పురస్కారాలను 2020కిగాను సీనియర్ నటులు, దర్శకులు, ప్రయోక్త యం.ఎస్.కె ప్రభుకు, 2021కుగాను నటులు, నాటక, టివి, సినిమా రచయిత వి. శ్రీశైలమూర్తికి ప్రధానం చేశారు. చాట్ల శ్రీరాములు పేరిట నెలకొల్పిన ప్రతిభా పురస్కారాన్ని 2021కుగాను నటులు, దర్శకులు, ప్రయోక్త, రూపశిల్పి డాక్టర్ రాయల హరిశ్చంద్రకు ప్రధానం చేశారు.
ప్రముఖ సంఘసేవకులు సారిపల్లి కొండలరావు, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రసరంజని కార్యదర్శి ముట్నూరి కామేశ్వరరావు తదితరులు పాల్గొని పురస్కారగ్రహీతల సేవలను కొనియాడారు. ముందుగా డాక్టర్ మొదలి నాగభూషణశర్మ రచించిన అతిథి దేవోభవ నాటికను ప్రస్థాన నాట్యరంగం సమర్పణలో విజయ్ ఆయంచ దర్శత్వంలో వేదికపై పలువురు నాటక రంగ కళాకారులు ప్రదర్శించి నాటకప్రియుల ప్రశంసలు అందుకున్నారు.