ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన అందుతున్న విషయం తెలిసిందే. వారి బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తూ విద్యాశాఖ తరఫున లెర్నింగ్ లింక్స్ సంస్థ ఆధ్వర్యంలో గేమ్స్, యానిమేషన్ రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని 50 పాఠశాలలను ఎంపిక చేయగా, ఇప్పటికే 20 పాఠశాలల్లో శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. మిగిలిన వాటిల్లో వచ్చే నెల నుంచి శిక్షణను ప్రారంభించనున్నారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న వారిలో ఒక్కో తరగతి నుంచి 10 నుంచి 12 మంది చురుకైన విద్యార్థులను ఎంపిక చేసి, ఇంజినీరింగ్లో నేర్పించాల్సిన గేమింగ్, ప్రోగ్రామింగ్ కోడింగ్పై ఫౌండేషన్ నిర్వాహకులు శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్లో పూర్తి పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు రోజుకు గంటపాటు కోడింగ్ తరగతులను నిర్వహిస్తున్నారు. మొబైల్స్లోనూ ప్రాక్టీస్ చేసుకునేలా మెళకువలను నేర్పిస్తుండడంతో ఆరు నెలల్లో శిక్షణ పూర్తి కానున్నది. శిక్షణ పూర్తైన తర్వాత విద్యార్థులు ఇన్నోవేషన్ రంగంలో రాణించాలన్నదే సర్కారు లక్ష్యం.
రంగారెడ్డి, సెప్టెంబర్ 26, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్పై పూర్తి పరిజ్ఞానంతోపాటు వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకునేలా విద్యాశాఖ, లెర్నింగ్ లింక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఒక ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కోడింగ్పై శిక్షణనిచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇంజినీరింగ్లో నేర్చుకోవాల్సిన ఇన్నోవేషన్ రంగానికి సంబంధించిన తరగతులను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేర్పించేందుకు నిర్ణయించారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండే గేమింగ్, యానిమేషన్ తదితర రంగాల్లో సర్కారు స్కూళ్ల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. తొలుత రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ పాఠశాలల విద్యార్థులకు కోడింగ్పై శిక్షణా కార్యక్రమాన్ని నీతి ఆయోగ్తోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంస్థ ఉచిత శిక్షణనిస్తున్నారు. రానున్న రోజులన్నీ ఇన్నోవేషన్ రంగంవైపే ఉండనున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కోడింగ్పై శిక్షణ..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, గేమింగ్, ప్రోగ్రామింగ్కు సంబంధించి కోడింగ్ ఎలా ఇస్తారనే దానిపై పూర్తి శిక్షణ ఇవ్వనున్నారు. ఆరు నెలల్లో గేమ్స్, యానిమేషన్కు సంబంధించి మూడు కోర్సుల్లో పూర్తి శిక్షణనివ్వనున్నారు. మొదట బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా కోడింగ్తో గేమ్ను తయారు చేయడం, యానిమేషన్ ప్రోగ్రామ్పై కోడింగ్ల ఆధారంగా విద్యార్థులకు నేర్పించనున్నారు. బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా కేవలం 20 రోజుల్లో విద్యార్థులు స్వతహాగా గేమ్స్ కనిపెట్టడంతోపాటు యానిమేషన్ ప్రోగ్రాంలో బేసిక్స్పై పట్టు సాధించనున్నారు. అనంతరం ఇంటర్మీడియట్ కోర్సులో భాగంగా 2డి యానిమేషన్తోపాటు 2డి గేమ్స్, 3డి యానిమేషన్; 3డి గేమ్స్లో విద్యార్థులకు శిక్షణనివ్వనున్నారు. రెండు నెలల్లో 2డి, 3డి గేమ్స్, యానిమేషన్లో పూర్తిగా శిక్షణనివ్వనున్నారు. చివరగా రెండు కోర్సులను ఉత్సాహంగా, యాక్టి వ్గా నేర్చుకున్న కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసి అడ్వాన్స్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రీ షార్ప్పై మూడు నెలలపాటు శిక్షణనివ్వనున్నారు. విద్యార్థులకు రోజుకు గంటపాటు లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణనివ్వనున్నారు. అనంతరం విద్యార్థులు మొబైల్స్లోనూ ప్రాక్టీస్ చేసుకునేలా కోడింగ్ మెళకువలను ఫౌండేషన్ నిర్వాహకులు నేర్పించనున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా 50 పాఠశాలలు ఎంపిక..
పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. 6వ తరగతి నుంచి 9 వ తరగతుల విద్యార్థులకు యానిమేషన్, గేమ్స్ ఇన్నోవేషన్పై శిక్షణనిస్తున్నారు. రెండు రోజులుగా 20 పాఠశాలల్లో కోడింగ్పై శిక్షణ తరగతులు ప్రారంభంకాగా, మిగతా స్కూళ్లలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రతీ తరగతి నుంచి ఉత్సాహంగా ఉన్న 10నుంచి 12 మంది విద్యార్థులను ఎంపిక చేసి, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 20 పాఠశాలలు, వరంగల్లో రెండు, కరీంనగర్, కామారెడ్డిల్లో రెండేసి చొప్పున ప్రభుత్వ పాఠశాలల్లో యానిమేషన్, గేమ్స్లో కోడింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 3, హయత్నగర్ 3, సరూర్నగర్ 5, శేరిలింగంపల్లి 9, శంకర్పల్లి 1, మొయినాబాద్ 1, షాబాద్ 3, ఫరూఖ్నగర్ 7, మాదాపూర్ 3, ఇబ్రహీంపట్నం 5, మహేశ్వరం 4, రాజేంద్రనగర్లో 6 పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.