పలు గ్రామ పంచాయతీల తీర్మానాలు
కొందుర్గులో సాయంత్రం 4 గంటల వరకే దుకాణాలు
ఎంకిర్యాలలో వారం పాటు లాక్డౌన్
ఇప్పటివరకు 6,11,263 మందికి టెస్టులు
జిల్లాలో యాక్టివ్ కేసులు మొత్తం 4,636
నేడు జిల్లాకు వ్యాక్సిన్లు వచ్చే అవకాశం
ఇప్పటివరకు జిల్లాలో..
2లక్షల మందికి వ్యాక్సినేషన్
రంగారెడ్డి, ఏప్రిల్ 17, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతున్నది. రోజుకు వందల మంది కరోనా బారిన పడుతుండడంతో కరోనాయాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. దీంతో జిల్లాలోని పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగడంతో స్వచ్ఛంద లాక్డౌన్వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్నగర్ గ్రామస్తులు స్వచ్ఛంద లాక్డౌన్ విధించేందుకు తీర్మానం చేసుకోగా, కొందుర్గు పట్టణంలోని పలు వ్యాపారులు దుకాణాలను సాయంత్రం 4గంటల వరకు తెరువాలని నిర్ణయించుకున్నారు. శనివారం నుంచి చౌదరిగూడ మండల కేంద్రంతోపాటు కొందుర్గు మండలం ఎంకిర్యాల గ్రామంలో వారంపాటు స్వచ్ఛంద లాక్డౌన్కు తీర్మానించారు.మరోవైపు జిల్లాలోని మున్సిపాలిటీల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ.1000 జరిమానా కూడా విధిస్తున్నారు.
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 750 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రజలు మాస్కులు, శానిటైజర్లను వాడకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతుండడంతో కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. అయితే సెకండ్ వేవ్లో చాలా వేగంగా కరోనా వ్యాపిస్తున్నది. జిల్లాలోని పలు గ్రామాల్లో మెజార్టీ ప్రజ లు కరోనా బారన పడ్డారు. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు జ్వరం తదితర లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్స్ తప్పనిసరిగా గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించి లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే హోంక్వారంటైన్లో ఉం డాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వ్యాక్సినేషన్పై అవగాహన కల్పి స్తూ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న ఆశావర్కర్లు లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు 6,11,263 మందికి కరోనా పరీక్షలు చేయగా, వీటిలో ఆర్టీపీసీఆర్ 66,666 మందికి, ర్యాపిడ్ 5,44, 597 మందికి పరీక్షలు చేశారు. అదేవిధంగా ప్రస్తుతం జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 28,324 ఉండగా, యాక్టివ్ కేసులు 4636, హోంఐసోలేషన్లో 8731 మంది ఉన్నారు.
జిల్లాలో మళ్లీ వ్యాక్సిన్ కొరత…
వారం రోజుల క్రితం జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలకే పరిమితమైన వ్యాక్సిన్ కొరత ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లోనూ నెలకొంది. శనివారంతో వ్యాక్సిన్ నిల్వలు పూర్తిగా నిండుకున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. శనివారం రాత్రి వరకు వ్యాక్సిన్ జిల్లాకు చేరుకోలేనట్లయితే ఆదివారం వ్యాక్సినేషన్ చేసేందుకు వ్యాక్సిన్ నిల్వలు లేవని స్పష్టం చేశారు. వారం రోజులుగా వ్యాక్సిన్ వేయించుకునే వారి సంఖ్య పెరుగడంతో వ్యాక్సిన్ నిల్వలు నిర్ణీత సమయం కంటే ముందే అయిపోయాయి.
ప్రస్తుతం 45 ఏండ్లకు పైబడిన వారితో పాటు ఫ్రంట్లైన్ వారియర్స్, ప్రజాప్రతినిధులు, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు, పంచాయతీ, రెవెన్యూ శాఖల ఉద్యోగులకు టీకాలు చేస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్కు డిమాండ్ పెరుగడంతో అందుకు అనుగుణంగానే అధికారులు ప్రభుత్వాసుపత్రుల్లో నిర్దేశించిన దాని కంటే అధికంగానే వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జిల్లాలోని 37 ప్రభుత్వాసుపత్రుల్లో వారం రోజులుగా దాదాపు 5వేల మందికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల వరకు వ్యాక్సినేషన్ పూర్తయింది.
ఇవి కూడా చదవండి
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో లావాదేవీ చార్జీలపై ఎస్బీఐ ఇలా..
IPL 2021: సన్రైజర్స్ హ్యాట్రిక్ ఓటమి