కవాడిగూడ : టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రజక అభివృద్ధి సంస్థ జాతీయ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.అంజయ్య(78) గుండె పోటుతో మరణించారు. గత వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన డాక్టర్ ఎం.అంజయ్య బంజారాహిల్స్లోని కేర్ దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
రజకాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి ఏపీలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడంతో గత వైఎస్ఆర్ హయాంలో అసెంబ్లీలో తీర్మాణం చేసే విధంగా ఒత్తిడి తీసుకువచ్చారు.
రజకాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో పాటు నిరుపేద రజకులకు లోయర్ ట్యాంక్బండ్లో రజక కాలనీలో ఇళ్ల నిర్మాణం, దోభిఘాట్ల అభివృద్దికి ఎంతో కృషి చేశారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఆలిండియా సాయి సేవా సమాజ్ అధ్యక్షుడిగా కొనసాగుతూ లోయర్ ట్యాంక్బండ్ ద్వారకానగర్లో శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయంలోనే తాను చనిపోయిన తర్వాత ఖణనం చేసే విధంగా సమాధిని కూడా ముందుగానే నిర్మించుకున్నారు. అయితే అంజయ్య మృతి తర్వాత ఆయనను ఆ ఆలయ ప్రాంగణంలో సమాధి చేయడానికి భక్తులు ఒప్పుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు అంజయ్య పార్థీవ దేహానికి బన్సీలాల్ పేట హిందూ స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు.
అంజయ్య పార్థీవ దేహాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఏపీ రజక సంఘం ఐక్య వేదిక అధ్యక్షుడు పత్తిపాక అంజయ్య, తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఎఎల్.మల్లయ్య, కవాడిగూడ కార్పోరేటర్ జి.రచనశ్రీ, శంషాబాద్ కార్పోరేటర్ కుమార్, తెలంగాణ రజకాభివృద్ధి చైర్మన్ బొమ్మరాజు కృష్ణ, వైస్ చైర్మన్ ఎం.నర్సింహా, ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్ నివాళ్లర్పించి అంజయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.