ధర్పల్లి/డిచ్పల్లి/ సిరికొండ, జనవరి 14 : నిజామాబాద్ జిల్లాలో గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వాన, ఈదురు గాలులకు భారీగా పంటనష్టం వాటిల్లింది. ధర్పల్లి మండలంలోని మైలారం, చల్లగరిగె, ధర్పల్లి గ్రామాల్లో మక్కజొన్న, పసుపు, మిర్చి, ఉల్లి తదితర పంటలు ధ్వంసమయ్యాయి. మైలారంలో ధ్వంసమైన పంట లను తహసీల్దార్ జయంత్రెడ్డి, మండల వ్యవసాయాధికారి ప్రవీణ్, సర్పంచ్ రమేశ్, సొసైటీ చైర్మన్ రాజేందర్రెడ్డి పరిశీలించారు. ఈ మండలంలో దాదాపు 200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తహసీల్దార్ తెలిపారు. నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిక ద్వారా అందజేస్తామని చెప్పారు. డిచ్పల్లి మండలం బర్ధిపూర్ గ్రామంలో 20 ఎకరాల ఆవాల పంట నేలవాలిందని మండల వ్యవసాయాధికారి రాంబాబు తెలిపారు. యానంపల్లిలో రెండెకరాల్లో జొన్న, కోరట్పల్లిలో ఎర్రజొన్న పంట ధ్వంసమైనట్లు చెప్పారు. ఏఈవోలు రూపేష్, వంశీకృష్ణ, అశ్రిత్రాజ్, భావనతో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం, నల్లవెల్లి గ్రామాల్లో మక్కజొన్న పంట నేలకొరిగిందని మండల వ్యవసాయాధికారిణి స్వప్న, ఏఈవో ప్రకాశ్ తెలిపారు. సిరికొండ మండలంలో పొద్దుతిరుగుడు, పెసర్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల కేంద్రం తోపాటు హుస్సేన్నగర్, తాళ్ల రామడుగు గ్రామాల్లో వానకు తోటలు నేలకొరిగాయి. పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
వడగండ్ల వానకు 116 ఎకరాల పంట నష్టం: జేడీఏ గోవింద్
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 116 ఎకరాల ఆరుతడి పంటలు దెబ్బతిన్నాయని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ తెలిపారు. సిరికొండ మండలంలో 25 ఎకరాల పొద్దుతిరుగుడు, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి మండలాల్లో 66 ఎకరాల మక్కజొన్న నేలకొరిగిందని వివరించారు. ధర్పల్లిలో ఎకరం, డిచ్పల్లి మండలంలో 22 ఎకరాల ఆవాల పంట ధ్వంసమైనట్లు చెప్పారు. 33శాతం పంటనష్టం వాటిల్లగా, 210 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. నష్టం వివరాలను సేకరించి కలెక్టర్కు అందజేస్తామని అన్నారు.